గల్లీ నుండి ఢిల్లీ వరకు బిసి ఉద్యమ జ్వాలలు

బెంగళూరులో జరుగబోయే జాతీయ ఓబీసీ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
ప్రభన్యూస్ మంగళగిరి జులై 21:
దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన బీసీల హక్కుల సాధన కోసం, కోట్లాదిమంది బీసీలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐక్యం చేసి,గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమ జ్వాలలను రగిలిస్తామని, ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అన్నారు. ఈరోజు స్థానిక మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో బిపి మండల్ కమిషన్ రిపోర్టును పార్లమెంటుకు సమర్పించిన రోజైన ఆగస్టు 7న,బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ వాల్పోస్టర్ ను ఆవిష్కరిస్తూ ఆ మేరకు ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కేసన మాట్లాడుతూ, గతంలో ప్రతి ఏటా ఆగస్టు 7 వ తేదీన ఢిల్లీ, ముంబై,నాగపూర్,హైదరాబాద్, తిరుపతి,అమృత్ సర్,గోవాలలో నిర్వహించిన జాతీయ మహాసభల వలెనే ఈసారి బెంగుళూరులో నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి నిర్వహించే జాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఓబిసి నాయకులు- ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు.ఇంకా వారు దేశవ్యాప్తంగా జాతి జన గణనలో బీసీ కులగణన చేపట్టాలని,మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలన్నారు. జనాభా దామాషా మేరకు చట్టసభలు- స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని పలు ప్రధాన డిమాండ్లపై జాతీయ మహాసభ లో చర్చించి,భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం డి లిమిటేషన్ మరియు మహిళా బిల్లులను పార్లమెంటులో అక్రమ పద్ధతుల్లో ఆమోదించుకోవాలని చూస్తుందన్నారు. బీసీల జనాభా లెక్కల తో సహా, రాజకీయంగా రిజర్వేషన్ల వాటా కోటాలు తేల్చకుండా,మహిళా బిల్లు-డీ లిమిటేషన్ బిల్లులను కేంద్రం ఆమోదించుకోవడాన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఆ బిల్లులు ఆమోదించబడకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆధిపత్య వర్గాల రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, ఈ బిల్లుల వల్ల బీసీలకు ఒరిగేదేమీ లేదన్నారు. కేవలం ఆదిపత్య పెత్తందార్ల భార్యలకు, కుమార్తెలకు, ఇతరకుటుంబ సభ్యులైన మహిళల్ని చట్టసభలకు పంపడానికే తప్ప, బలహీన వర్గాలైన బిసి ప్రజలకు రాజకీయంగా జరిగే మేలేమీ లేదన్నారు. ఇకపై బీసీల ఆకాంక్షలను గౌరవించకపోతే జెన్ జీ ఉద్యమ తరహా బీసీ ఉద్యమం దేశవ్యాప్తమవుతుందని శంకరరావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు పారేపల్లి మహేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివరాం బాబాజీ,రాష్ట్ర నాయకులు మేకా వెంకటేశ్వరరావు,వాకా వెంకటేశ్వరరావు, కోలా అశోక్, మహంతి వాసు, జిల్లా నాయకులు జన్జనం వరప్రసాద్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు జొన్నాదుల వెంకటకృష్ణ,ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ప్రసాద్, ధనుంజయ రావు,దానా గౌడ్ పలువురు బీసీ నాయకులు పాల్గొని ప్రసంగించారు.
