Last Updated:
Uttar Pradesh: పురాణాల్లో పతిభక్తికి, త్యాగానికి చిహ్నంగా సతి సుమతి కథను మనం వినే ఉంటాం. అనారోగ్యంతో ఉన్న తన భర్తను తలపై ఉన్న గంపలో పెట్టుకుని మోసిన సుమతి నిష్టను కనులారా చూడకపోయినా కథల రూపంలో చదువుకుని ఆశ్చర్యపోతుంటాం.
కానీ, ఆధునిక యుగంలో స్వార్థం నిండిన సమాజంలో కూడా అలాంటి నిశ్చలమైన అనురాగానికి, పతిభక్తికి ఉదాహరణగా నిలిచింది ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఆశా అనే మహిళ. విధి విసిరిన సవాలును స్వీకరించి, నడవలేని స్థితిలో ఉన్న తన భర్తను భుజాలపై మోస్తూ ఏకంగా 180 కిలోమీటర్ల కావడి యాత్రను పూర్తి చేసి వార్తల్లో నిలిచింది.
ఈటీవీ భారత్ కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, ఘాజియాబాద్ జిల్లాలోని మోదీనగర్ ప్రాంతానికి చెందిన ఆశా, సచిన్ల దాంపత్య జీవితం ఒకప్పుడు సంతోషంగానే సాగింది. కానీ కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో సచిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆయన కాళ్ళు పనిచేయకుండా పోయాయి. దీంతో సచిన్ పూర్తిగా నడవలేని స్థితికి చేరుకుని, మంచానికే పరిమితమయ్యాడు. ఆ క్షణం నుండి ఇంటి బాధ్యతలతో పాటు భర్త సంరక్షణను కూడా ఆశానే తన భుజాలపై వేసుకుంది.
పవిత్రమైన శ్రావణ మాసంలో పరమశివుడికి నీటితో అభిషేకం చేసేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు కావడి యాత్ర చేపడతారు. నడవలేని స్థితిలో ఉన్న సచిన్కు కూడా హరిద్వార్ వెళ్ళి కావడి యాత్ర చేయాలని, భోళాశంకరుడిని దర్శించుకోవాలని బలమైన కోరిక కలిగింది. భర్త మనసులోని మాటను గ్రహించిన ఆశా, అడ్డంకులు ఎన్ని ఉన్నా ఆయన కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకుంది. వాహనాల్లో వెళ్లడం కాకుండా, సాంప్రదాయబద్ధంగా కాలినడకన అదీ తన భర్తను మోస్తూనే ఈ యాత్రను పూర్తి చేయాలని దృఢ సంకల్పం పూనింది.
హరిద్వార్ నుండి మొదలైన ఈ కావడి యాత్ర అత్యంత క్లిష్టంగా సాగింది. ఒకవైపు కఠినమైన నియమాలు, మరోవైపు భర్త బరువును భుజాలపై మోస్తూ కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి. హరిద్వార్లో కావడి యాత్ర అధికారికంగా ప్రారంభం కాకముందే వీరు అక్కడికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎండ, వర్షం, శారీరక అలసట ఏవీ ఆమె నిశ్చయాన్ని సడలించలేకపోయాయి. దారిపొడవునా వీరిని చూసిన ఇతర యాత్రికులు, స్థానికులు ఆశా భక్తికి, ఆమె ప్రేమానురాగాలకు ముగ్ధులయ్యారు. “హర్ హర్ మహాదేవ్” స్మరణలతో ఆమెకు దారి పొడవునా ధైర్యాన్ని, మద్దతును అందించారు.
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, భర్త సంతోషమే తన సంతోషంగా భావించి 180 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని ఆశా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు; అది ఆశా-సచిన్ల మధ్య ఉన్న గాఢమైన బంధానికి, నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. కష్టసమయాల్లో తోడుగా నిలవడమే నిజమైన ప్రేమ అని ఆశా రుజువు చేసింది.
నేటి తరానికి ఈ దంపతుల ప్రయాణం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కేవలం ఆడంబరాలు కాదని, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడే గుణమని ఆశా తన చర్య ద్వారా నిరూపించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో వైరల్గా మారి, ఆశా సాహసానికి, పతిభక్తికి నెటిజన్ల నుండి నీరాజనాలు అందుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana

