వ్యక్తిగత పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు చెక్ , రామ్ మందిర్ సబ్ సెంటర్లో ఆరోగ్య శిబిరం.
130 మందికి వైద్య పరీక్షలు, మందుల పంపిణీ.
ప్రభ న్యూస్ కామారెడ్డి జిల్లా జులై 24 :
కామారెడ్డి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని రామ్ మందిర్ సబ్ సెంటర్లో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 130 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి ఇంట్లో వారానికి రెండుసార్లు మంగళవారం, శుక్రవారం ‘డ్రై డే’ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, నిల్వ నీటిని తొలగించడం ద్వారా దోమల గుడ్లు, లార్వా నశించి వాటి వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.
డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా, ఫైలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నివారణలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రప్రియ (ఎంఓ), కే. శ్యామల (ఎంపీహెచ్ఎస్), ఎన్. సరూప (ఏఎన్ఎం), ఆశా వర్కర్లుతో పాటు రామ్ మందిర్ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

