మార్నింగ్ వాక్లోనే ప్రజల సమస్యలపై ఫోకస్.. రూ.100 కోట్లతో ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి

ప్రభ న్యూస్, ఖమ్మం రూరల్ (ఏదులాపురం), ఆగస్టు 7:
ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌళిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు.శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్తో కలిసి మంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, ఇందిరమ్మ కాలనీలలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో కాలినడకన పర్యటిస్తూ పారిశుద్ధ్య పరిస్థితులు, అభివృద్ధి పనులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.పర్యటన సమయంలో వర్షం కురుస్తున్నప్పటికీ మంత్రి పొంగులేటి వెనుదిరగకుండా గొడుగు పట్టుకుని కాలనీల్లోనే కాలినడకన పర్యటించారు. వర్షంలోనూ ప్రజల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకోవడంతో స్థానికులు తమ సమస్యలను నిర్మొహమాటంగా వివరించారు. అధికారులకు అక్కడికక్కడే పలు సమస్యలపై ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు.మంత్రి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల విలీనంతో ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల నిధులను మంజూరు చేశారని వెల్లడించారు. ప్రజలకు అత్యవసరమైన మౌళిక వసతులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తిస్తున్నామని చెప్పారు.లోతట్టు ప్రాంతాల్లో తుమ్మ చెట్లు పెరగడం, వర్షపు నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలను గుర్తించామని, వాటి శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర డ్రైనేజీ వ్యవస్థతో పాటు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని ప్రజలు దృష్టికి తీసుకువచ్చారని, దానిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యుత్ తీగలకు సంబంధించిన సమస్యలను కూడా సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కోసం వచ్చిన వినతులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పార్కుల అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో అధికారులు రాజీ పడొద్దని, ప్రతి పనిని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.పర్యటనలో భాగంగా సాయిగణేష్ నగర్లోని రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో స్థానికులతో కలిసి టీ తాగిన మంత్రి, అనంతరం ఇందిరమ్మ కాలనీలో వర్షంలోనే గొడుగు పట్టుకుని కాలినడకన పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. వర్షం కారణంగా నీరు నిలిచిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు మౌళిక వసతుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస చారి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


