జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ పర్యటనలో నవీన్ కుమార్ కాణిపాకం, చిన్నకంపల్లి, కొత్తపల్లి, వడ్డేరామాపల్లి, దొడ్డిపల్లి, గాయత్రి నగర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, డిజిటలైజేషన్ ప్రక్రియ ఎలా సాగుతోందో స్వయంగా పరిశీలించారు. అలాగే ఇంటింటా సర్వే నిర్వహిస్తున్న బీఎల్ఓలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బీఎల్ఓలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఇంటింటా సర్వేను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎలాంటి అర్హుడు ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, మిగిలిన పనులను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఐరాల మండలం చిన్నకంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం కార్యదర్శి పర్యటన ముఖ్య ఉద్దేశం జిల్లాలో ఎస్ఎస్ఆర్ కార్యక్రమం పురోగతిని పరిశీలించడమేనని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 97 శాతం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం సుమారు 40 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వాటిలో చాలా వరకు వెంటనే పరిష్కరించే అవకాశం ఉందని, మిగిలిన వాటిని అవసరమైన ధ్రువీకరణ అనంతరం పూర్తి చేస్తామని చెప్పారు. మిగిలిన మూడు శాతం పనులను కూడా రేపు మధ్యాహ్నం నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఎస్ఎస్ఆర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి ప్రధాన తప్పిదాలు లేదా గణనీయమైన ఫిర్యాదులు నమోదు కాలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరికైనా తమ దరఖాస్తుకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఉంటే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని సూచించారు.
అలాగే ప్రతి బీఎల్ఓకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, చిరునామా మార్చుకున్న వారు లేదా ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వారి వివరాలను సంబంధిత రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించినట్లు తెలిపారు. దీంతో మొత్తం ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగుతుందని పేర్కొన్నారు.
“అర్హుల ఓట్లు తొలగించే ప్రసక్తే లేదు” అని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో పాటు ఎన్యూమరేషన్ ఫారమ్ను బీఎల్ఓకు సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నెల 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల అవుతుందని, అందులో పేరు లేకపోయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పిస్తే తుది జాబితాలో పేరు చేర్చుతామని హామీ ఇచ్చారు.
పర్యటన అనంతరం ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆయనకు స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం దేవస్థానం అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమొక్కను అందించి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఐరాల తహసీల్దార్, పట్టణ తహసీల్దార్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, కాణిపాకం ఎస్ఐ, బీఎల్ఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.
