అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న అశోక్నగర్ రహదారి!
వర్షపు నీటిలో దాగిన గుంతలు.. ప్రమాదాల అంచున వాహనదారులు
ప్రభన్యూస్ నేత్రానికి చిక్కిన దయనీయ దృశ్యం
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు
ప్రభన్యూస్ – కామారెడ్డి జిల్లా, ఆగస్టు 1:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీ ప్రధాన రహదారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు ఎన్నో రోజులుగా వాహనదారులు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు పలుమార్లు కోరుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించిన దాఖలాలు కనిపించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారిపై ఉన్న గుంతలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో రోడ్డుపై గుంతలు ఎక్కడ ఉన్నాయో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడిపోతామేమోనన్న భయంతో ప్రయాణం సాగిస్తున్నారు. వర్షపు నీటిలో దాగిన ఈ ప్రమాదకర గుంతల కారణంగా వాహనదారులు పడుతున్న ఇబ్బందుల దృశ్యం ప్రభన్యూస్ నేత్రానికి చిక్కింది.రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. వర్షపు నీటితో నిండిన గుంతలు కనిపించక వాహనాలు ఒక్కసారిగా అదుపుతప్పే ప్రమాదం ఉందని, ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు కూడా ఈ రహదారిపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అశోక్నగర్ ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలపై ఇప్పటికే పలు వార్తలు ప్రచురితమైనప్పటికీ, సంబంధిత అధికార యంత్రాంగంలో ఎలాంటి కదలిక కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు రహదారి దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.“ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి, ప్రాణాలు కోల్పోయిన తర్వాతే అధికారులు స్పందిస్తారా?” అంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి, వాహనదారుల భద్రతకు చర్యలు తీసుకోలేని పరిస్థితిలో అధికార యంత్రాంగం పనిచేయడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అశోక్నగర్ కాలనీ ప్రధాన రహదారిని పరిశీలించాలని, వర్షపు నీటిని తొలగించి ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వతంగా రహదారికి మరమ్మతులు చేపట్టి, వాహనదారులు, ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారా? లేక ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు చేపడతారా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం అశోక్నగర్ కాలనీవాసులు ఎదురుచూస్తున్నారు.

