Last Updated:
Vijayawada: ఉపాధి, మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కనే నిరుద్యోగులు, యువత ఆశలను ఆసరాగా చేసుకుని ఒక మోసపూరిత కన్సల్టెన్సీ సంస్థ భారీ దందాకు తెరలేపింది.
విదేశాల్లో ఊరించే జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, సుమారు 700 మంది అమాయక బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టించిన దారుణ ఘటన విజయవాడ నగరం వేదికగా వెలుగు చూసింది. విదేశీ ఉద్యోగాల పేరుతో సాగిన ఈ మాయాజాలం బయటపడటంతో బాధితులు వీధిన పడ్డారు.
ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులు తమ ఆవేదనను మీడియా సమక్షంలో వెళ్లగక్కారు. ‘ఫ్లైయింగ్ బోర్డ్స్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్’ (Flying Boards Consultancy Pvt Ltd) అనే సంస్థను ఏర్పాటు చేసి, దాని యజమానురాలు ముసునూరి సౌజన్య విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని విపరీతంగా ప్రచారం చేసుకున్నారని బాధితులు తెలిపారు.
విదేశీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు ఆన్లైన్ ఇంటర్వ్యూల పేరుతో డ్రామాలు ఆడారని, అనంతరం నిజమైనవిగా నమ్మించేలా నకిలీ నియామక లేఖలను (Fake Offer Letters) అందజేశారని ఆరోపించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వివిధ దఫాలుగా కోట్లలో నగదు వసూలు చేశారు.
నెలలు గడుస్తున్నా వీసాలు, ఉద్యోగాల జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆన్లైన్ ఇంటర్వ్యూలు మరియు ఆఫర్ లెటర్లను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో సదరు సంస్థ విజయవాడలోని ఆఫీసును రాత్రికి రాత్రే మూసివేసి యజమానురాలు సౌజన్య పరారయ్యారు.
బాధితులు హైదరాబాద్లోని కన్సల్టెన్సీ మరో కార్యాలయానికి వెెళ్లి అక్కడ సౌజన్యను నిలదీయగా.. సమాధానం చెప్పకపోగా, ఎదురు తమపైనే పోలీసు కేసులు పెడతానని, తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగినట్లు బాధితులు వాపోయారు.
రజని, వరలక్ష్మి (కాకినాడ): “మాకు విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.5 లక్షలు తీసుకున్నారు. ఇంటర్వ్యూలు నకిలీవని తెలిసి డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదు.”
వెంకటేశ్వరరావు (ఏలూరు): “మా కుమారుడి భవిష్యత్తు బాగుంటుందని ఆశపడి రూ.6 లక్షలు చెల్లించాం. మా వద్ద డబ్బులు లేకపోయినా బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టాం. నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేశారు. డబ్బులు అడిగితే దాటవేస్తున్నారు.”
అప్పులపాలై, సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని, మోసపూరిత ఫ్లైయింగ్ బోర్డ్స్ కన్సల్టెన్సీపై, దాని యజమానురాలు ముసునూరి సౌజన్యపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. తమకు రావలసిన సొమ్మును రికవరీ చేసి ఇప్పించి, న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
Hyderabad,Telangana

