Last Updated:
ఈ జిల్లా వాసులకు పండగే.. దశాబ్దాల కల నెరవేరుస్తూ కేంద్రం భారీ నజరానా, మారిపోనున్న రూపురేఖలు.
ఓరుగల్లు వాసుల దశాబ్దాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. చారిత్రక నగరం వరంగల్ మామునూరు విమానాశ్రయం కల త్వరలోనే సాకారం కాబోతోంది. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీవ్ర కృషికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఏకంగా రూ.203.49 కోట్లతో విమానాశ్రయ అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించింది. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వరంగల్ ప్రజల ఆశలు నెరవేరుతూ, ఆకాశయానానికి మార్గం సుగమమైంది. మరోవైపు, పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మొత్తం 949.44 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని అత్యంత ఆధునికంగా నిర్మించనున్నారు. రన్వే ఆధునీకరణ, టెర్మినల్కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ కోసం ఆప్రాన్, టాక్సీవేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాలు, ఎమర్జెన్సీ రోడ్లను 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ.2,034.98 కోట్లుగా అంచనా వేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వరంగల్-సూర్యాపేట జాతీయ రహదారి (NH-563) వైపు ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ప్రతిపాదించారు. అక్కడినుంచి ప్రత్యేక రహదారి గుండా టెర్మినల్ భవనానికి చేరుకునేలా అద్భుతమైన డిజైన్ రూపొందించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐసోలేషన్ బే వంటి అత్యవసర సదుపాయాలను సైతం ఈ ప్లాన్లో పొందుపరిచారు.
ప్రాజెక్టు పనుల కోసం ఈనెల 23న మామునూరు విమానాశ్రయ ప్రాంగణంలో ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తారు. జులై 29 నుంచి ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 18న బిడ్లు ఓపెన్ చేసి, సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్ తెరవనున్నారు. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 2028 జూన్ నాటికి ఎయిర్పోర్టును ప్రారంభించాలనే సీఎం లక్ష్యానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని, మూడు వారాల్లో పనులు మొదలవుతాయని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లాంటి కీలక నిర్మాణాలకు త్వరలోనే మరో టెండర్ పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ చారిత్రక వారసత్వం ఉట్టిపడేలా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దనున్నారు. కాకతీయుల కళా వైభవం స్పష్టంగా ప్రతిబింబించేలా టెర్మినల్ భవనం, ప్రధాన ప్రవేశ ద్వారాలు, అంతర్గత అలంకరణలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో వరంగల్కు వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలో అడుగుపెట్టగానే కాకతీయుల గొప్పతనం కళ్లముందు కదలాడుతుంది. సాంకేతికంగా చూస్తే 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో భారీ రన్వే నిర్మిస్తున్నారు. తద్వారా ఎయిర్బస్ 320 లాంటి పెద్ద ప్రయాణికుల విమానాలతో పాటు భారీ కార్గో విమానాలు కూడా అత్యంత సులభంగా దిగే అవకాశం కలుగుతుంది.
ఈ ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. స్థానిక వ్యాపారవేత్తలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి మహా నగరాలకు ఉదయం వెళ్లి రాత్రికల్లా తిరిగి వచ్చే వీలుంటుంది. ఫలితంగా వ్యాపార సమావేశాలు, పెట్టుబడుల రాక వేగవంతం అవుతాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలకు వేగవంతమైన రవాణా సదుపాయం లభిస్తుంది. వరంగల్ నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడంతో పాటు దేశ విదేశీ పర్యాటకుల రాక అనూహ్యంగా పెరుగుతుంది. విమానాశ్రయ నిర్మాణం, నిర్వహణ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Warangal,Telangana
