Last Updated:
Suicide: ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించి మరో యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్వేర్ మహిళా ఇంజినీర్ ముంబయిలో బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ఘోర సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొండూరు గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈనాడు కథనం ప్రకారం.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు గ్రామానికి చెందిన అద్దంకి కీర్తి (24) ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తోంది. ప్రకాశం జిల్లా పొండూరుకు చెందిన పాపినేని సాయి అనే యువకుడు ఖతార్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.
అయితే, సాయి కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం అతనికి మరో యువతితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలిసి కీర్తి తన తల్లిదండ్రులతో కలిసి ఒంగోలులోని సాయి కుటుంబ సభ్యులను కలిసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. కానీ, వారు పెళ్లికి నిరాకరించడమే కాకుండా కీర్తి కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తి తిరిగి ముంబయిలోని తన గదికి వెళ్లిపోయింది. ప్రియుడి చేతిలో మోసపోయాననే బాధను తట్టుకోలేక ఈ నెల 14న ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ముంబయి పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం కీర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం కీర్తి శవపేటికను ఆమె బంధువులు సాయి స్వగ్రామమైన పొండూరుకు తీసుకువచ్చారు. కన్నకూతురికి జరిగిన అన్యాయానికి సాయి ఇంటి వరండాలోనే మృతదేహాన్ని ఉంచి కన్నీరుమున్నీరుగా విలపించారు.
మోసం చేసిన సాయిని కఠినంగా శిక్షించాలని, అతని చేత కీర్తి మృతదేహానికి తాలికట్టించి అంత్యక్రియలు నిర్వహించాలని బాధిత కుటుంబం పట్టుబట్టింది. ఆ సమయంలో సాయి ఇంట్లో ఎవరూ లేకపోగా, కీర్తి మరణవార్త తెలిసి అతను ఖతార్కు పారిపోయాడని బాధిత కుటుంబం ఆరోపించింది.
సమాచారం అందుకున్న టంగుటూరు పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. అనంతరం సాయి బంధువులు జోక్యం చేసుకుని, వారి సంప్రదాయాల ప్రకారం కీర్తి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Hyderabad,Telangana

