Last Updated:
విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము గోల్డ్ మెడల్స్ అందజేశారు, నారా లోకేష్ నాణ్యమైన విద్య, గిరిజన సాధికారత ప్రాముఖ్యతను హైలైట్ చేశారు
విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా బంగారు పతకాలను అందజేశారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందుకోవడం తమ జీవితంలో మరచిపోలేని ఘట్టమని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యను అందించిన యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మంచి విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని రాష్ట్రపతి విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే విద్యాసంస్థలు మాత్రమే కాదని, అవి కలలకు రూపమిచ్చే కేంద్రాలని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే వేదికలని అన్నారు.
ఈ తొలి స్నాతకోత్సవం కేవలం ఒక విద్యా కార్యక్రమం మాత్రమే కాదని, అవకాశాలు, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక ఘట్టమని లోకేష్ అభివర్ణించారు. దేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి సామాజిక వర్గానికి నాణ్యమైన విద్య అందినప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు విద్యను అందించడమే కాకుండా సామాజిక పరివర్తనకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఒక కుటుంబంలో తొలి తరం విద్యార్థి పట్టభద్రుడైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, అదే దేశ ప్రగతికి బాటలు వేస్తుందని లోకేష్ అన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, విజ్ఞానంతో ప్రతి పౌరుడిని సాధికారత వైపు నడిపించడంతో పాటు మన గొప్ప గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడమే వికసిత్ భారత్ లక్ష్యమని వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితాన్ని విద్యార్థులకు ఆదర్శంగా చూపిస్తూ లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడా అనే చిన్న గిరిజన గ్రామంలో జన్మించిన ఆమె ఎన్నో కష్టాలను అధిగమించి, తన గ్రామం నుంచి డిగ్రీ పూర్తి చేసిన తొలి మహిళగా నిలిచారని గుర్తుచేశారు. ఆమె వేసిన ఒక్క అడుగు వేలాది గిరిజన బాలికలకు స్ఫూర్తిగా మారిందని, విద్య జీవితాలను ఎలా మార్చగలదో ఆమె ప్రస్థానమే గొప్ప ఉదాహరణ అని కొనియాడారు.
డిగ్రీ ఒక వృత్తిని అందించవచ్చని, కానీ వ్యక్తిత్వమే గౌరవాన్ని సంపాదించి పెడుతుందని లోకేష్ విద్యార్థులకు సూచించారు. జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసంతో, తమ మూలాలను గర్వంతో, విలువలను వినయంతో జీవితాంతం వెంట తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమాజానికి చేసే సేవే నిజమైన వారసత్వమని పేర్కొంటూ, ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు అందుకున్న ప్రతి విద్యార్థి మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో జరిగిన ఈ తొలి స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.
Visakhapatnam,Andhra Pradesh
Jun 30, 2026 10:45 PM IST
