ఐఆర్సీటీసీ టూరిజం తొమ్మిది రోజుల దక్షిణ భారత ఆలయ యాత్రను ప్రకటించింది. “దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం” పేరుతో నడిచే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీలో ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు స్టేషన్ల నుంచి ఈ రైలులో ఎక్కే అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ టూరిజం ప్రకటించిన ఈ యాత్ర 2026 అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల పాటు సాగే ఈ టూర్లో తిరువణ్ణామలై (అరుణాచలం), చిదంబరం, తిరుచిరాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో మొత్తం 705 సీట్లు ఉంటాయి. ఇందులో 237 స్లీపర్ క్లాస్, 416 3ఏసీ, 52 2ఏసీ బెర్తులు ఉన్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

