ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు.
పోలీసు విచారణకు హాజరైన జీఓ–3, 1/70 ఉద్యమ నాయకులు.
అల్లూరి ప్రభ జిల్లా ప్రతినిధి జూలై 20 :
జీఓ నంబర్–3 రిజర్వేషన్ పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పాడేరులో నిర్వహించిన గిరిజనుల ఆందోళనకు సంబంధించి నమోదైన కేసు నేపథ్యంలో పలువురు ఉద్యమ నాయకులు సోమవారం పాడేరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.గత శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో కొందరు వక్తలు ప్రభుత్వ ఆస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న నాయకులు పోలీసుల ఎదుట హాజరై విచారణకు పూర్తి సహకారం అందించారు.
విచారణలో భాగంగా సభలో చేసిన ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలించినట్లు సమాచారం. నాయకుల నుంచి వివరణలు నమోదు చేసిన అనంతరం, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.విచారణకు హాజరైన వారిలో పి. అప్పలనర్స, రాధాకృష్ణ, కర్జ వైకుమార్, కొర్ర కార్తిక్, వంతల దాస్, కొంట సుధీర్ కుమార్, లోకేష్, కొర్ర రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా పి. అప్పలనర్స మాట్లాడుతూ, పోలీసు విచారణకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తమ ఉద్యమ విధానం కాదని స్పష్టం చేశారు. సభలో చోటుచేసుకున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ, వాటిని తమ ఉద్యమ లక్ష్యాలతో ముడిపెట్టకూడదన్నారు.
అలాగే, ఆదివాసీ ఉద్యమకారులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడకూడదని ఆయన కోరారు. ఒకవేళ అన్యాయమైన చర్యలు కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా, తదుపరి పరిణామాలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

