Last Updated:
టిడ్కో లబ్ధిదారులకు ఊరట. పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.
ఆరేళ్లుగా తాము చెల్లించిన డబ్బు తిరిగి వస్తుందా.. లేదా? అనే ఆందోళనతో ఎదురు చూస్తున్న టిడ్కో లబ్ధిదారులకు చివరకు ఊరట లభించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గతంలో టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకుని డీడీల రూపంలో సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ఈ సమస్యకు పరిష్కారం దొరకడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో టిడ్కో గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా లబ్ధిదారులు తమ వాటాగా రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు డీడీల రూపంలో చెల్లింపులు చేశారు. పలమనేరు మున్సిపల్ పరిధిలో మొత్తం 278 మంది ఈ పథకంలో భాగస్వాములయ్యారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత టిడ్కో గృహాల పనులు నిలిచిపోవడంతో, వారు చెల్లించిన సొమ్ము కూడా తిరిగి అందక ఏళ్ల తరబడి నిరాశలో గడిపారు.
ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే ఎన్. అమరనాథ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి సుమారు రూ.28 లక్షలు మంజూరు చేయించారు. దీంతో ఆ మొత్తానికి సంబంధించిన చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. దీంతో తమ డబ్బు ఇక తిరిగి రాదని భావించిన కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలా ప్రోత్సహించడం, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఇప్పటికే అమలు చేశామని, గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఇక టిడ్కో లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం న్యాయం చేస్తోందని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఆయన మెగా చెక్కును ఆవిష్కరించి, లబ్ధిదారులకు వ్యక్తిగత చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ, మెప్మా సీఎంఎం బాబా, టీపీఎస్ ఇందిర, ఏఈ స్నేహప్రియా, బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు అర్వి బాలాజీతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Chittoor,Chittoor,Andhra Pradesh

