Last Updated:
తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది. కే. రామకృష్ణారావు పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సేవల నుంచి తిరిగి వచ్చిన సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు.
తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న కే. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా నియామక ఉత్తర్వులు విడుదల చేసింది.
1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ఇటీవల వరకు కేంద్ర డిప్యూటేషన్పై ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Development of North Eastern Region) కార్యదర్శిగా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (DoPT) ఆయనను పేరెంట్ కేడర్కు తిరిగి పంపుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆయనను తదుపరి సీఎస్గా నియమించింది.
తెలంగాణకు కొత్త సీఎస్గా సంజయ్ జాజు నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.The Telangana Government has issued orders appointing Sanjay Jaju as the new Chief Secretary of the state.#Telangana #SanjayJaju pic.twitter.com/WdVWb6nldt
— Congress for Telangana (@Congress4TS) June 26, 2026
కొత్త సీఎస్ ఎంపిక ప్రక్రియలో సంజయ్ జాజుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అదేవిధంగా 1992 బ్యాచ్కు చెందిన మరో అధికారి వికాస్ రాజ్ కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం జయేశ్ రంజన్ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ క్రీడలు, పర్యాటక శాఖలకు అదనపు బాధ్యతలు చేపట్టారు. వికాస్ రాజ్ రవాణా, రహదారులు, భవనాల (ఆర్&బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ, కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవల రిలీవ్ అయిన సంజయ్ జాజుపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకున్నారు.
సంజయ్ జాజుకు పరిపాలనా రంగంలో విస్తృత అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా, విశాఖపట్నం కమిషనర్గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, అనంతరం కమిషనర్గా సేవలందించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్)ను జీహెచ్ఎంసీగా విస్తరించే ముందు కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే పౌరసరఫరాల సంస్థ కమిషనర్గా కూడా పని చేశారు. 2014 నుంచి కేంద్ర డిప్యూటేషన్లో కొనసాగుతూ పలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, 15 సంవత్సరాలకు పైగా కేంద్ర సేవల్లో పనిచేశారు. సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు.
రాష్ట్ర పరిపాలనలో కీలక సమయంలో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా సమన్వయం, ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో కొత్త సీఎస్ కీలక పాత్ర పోషించనున్నారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తెలంగాణ అటవీ శాఖలో కూడా కీలక పరిపాలనా మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) డాక్టర్ సి. సువర్ణ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమెను సర్వీసు నుంచి రిలీవ్ చేస్తూ ప్రస్తుత సీఎస్ కే. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్కు పీసీసీఎఫ్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్లైఫ్)తో పాటు చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ (CWLW)గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Hyderabad,Telangana

