మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. ప్రస్తుతం సుమారు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు 8వ వేతన సంఘం నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. వేతన సంఘం సిఫార్సుల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఉద్యోగుల పే మ్యాట్రిక్స్లోని ప్రస్తుత బేసిక్ పేను ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో గుణించడం ద్వారానే కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. బేసిక్ పే పెరిగిన వెంటనే HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర భత్యాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగులు ఈ అంశంపై అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 8వ వేతన సంఘం ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో వరుసగా సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 2 నుంచి 5 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పెంచాలని కోరుతుండగా, మరోవైపు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఖజానాపై పడే భారం, భవిష్యత్ వ్యయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో తుది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతగా నిర్ణయిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

