సుకన్య సమృద్ధి యోజనలో ప్రధాన ప్రయోజనం దీర్ఘకాల కాంపౌండింగ్. 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేసిన తర్వాత కూడా మెచ్యూరిటీ వరకు ఖాతాకు వడ్డీ వస్తూనే ఉంటుంది. దీంతో పెట్టుబడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఒక తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం గరిష్టంగా రూ.1.50 లక్షలు చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.22,50,000 అవుతుంది. ప్రస్తుత 8.2% వడ్డీ రేటు కొనసాగితే కాంపౌండింగ్ ప్రభావంతో మెచ్యూరిటీ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం మెచ్యూరిటీ మొత్తం సుమారు రూ.69 లక్షల వరకు చేరవచ్చు. అయితే భవిష్యత్తులో ప్రభుత్వం ప్రకటించే వడ్డీ రేట్ల ఆధారంగా అసలు మొత్తం మారవచ్చు. అయితే ఏడాదికి రూ.1,50,000 జమ చేయకపోయినా తక్కువ మొత్తంలో పొదుపు చేయడం ద్వారా కూడా మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఉదాహరణకు, రోజుకు సుమారు రూ.100 పొదుపు చేస్తే నెలకు దాదాపు రూ.3,000 అవుతుంది. సంవత్సరానికి ఇది రూ.36,000 అవుతుంది. 15 సంవత్సరాలు ఈ మొత్తాన్ని పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.5,40,000 అవుతుంది. ప్రస్తుత 8.2% వడ్డీ రేటు మారకుండా కొనసాగితే కాంపౌండింగ్ ప్రభావంతో మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.16.62 లక్షల వరకు నిధి ఏర్పడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
