Last Updated:
ఆర్థిక ఇబ్బందులున్న వ్యక్తులు, సంస్థలు దివాలా పిటిషన్ వేయవచ్చు. రుణదాతలు కూడా కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ఆస్తులను జప్తు చేసి, రుణదాతలకు చెల్లిస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు ఒక్కోసారి వ్యక్తులను, వ్యాపార సంస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుంటాయి. అప్పులు పెరిగిపోవడం, వాటిని తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడం వంటి సందర్భాల్లో దివాలా పిటిషన్ (ఇన్సాల్వెన్సీ పిటిషన్) అనే చట్టపరమైన మార్గం అందుబాటులో ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి లేదా సంస్థ తన అప్పులు చెల్లించేందుకు తగిన నగదు లేదా ఆస్తులు లేక ఆర్థిక బాధ్యతలను నిర్వర్తించలేని స్థితిని చట్టపరంగా దివాలా పరిస్థితిగా పరిగణిస్తారు. అలాంటి సందర్భాల్లో కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని వరంగల్కు చెందిన న్యాయవాది గంధం శివ వివరించారు.
న్యాయవాది గంధం శివ తెలిపిన వివరాల ప్రకారం, అప్పులు చెల్లించలేని వ్యక్తి లేదా సంస్థ స్వయంగా దివాలా పిటిషన్ దాఖలు చేయవచ్చు. అలాగే వారికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లేదా ఇతర రుణదాతలు కూడా కోర్టులో పిటిషన్ వేయడానికి హక్కు కలిగి ఉంటారు. కోర్టు కేసును పరిశీలించిన అనంతరం అవసరమైతే సంబంధిత వ్యక్తి లేదా సంస్థ ఆస్తులను జప్తు చేయడం, వేలం వేయడం ద్వారా రుణదాతలకు చట్టప్రకారం బకాయిలు చెల్లించే ప్రక్రియను చేపడుతుంది.
ఇన్సాల్వెన్సీ ప్రొవిన్షియల్ యాక్ట్–1920లోని వివిధ నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ అమలులో ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకులకు బకాయిలు చెల్లించని సంస్థలపై కొన్ని చట్టపరమైన సెక్షన్ల కింద దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిర్దిష్ట అర్హతలు నెరవేరితే వ్యక్తిగత రుణగ్రహీతలు కూడా దివాలా పిటిషన్ వేయవచ్చు. రుణగ్రహీతకు రూ.500 కంటే ఎక్కువ అప్పు ఉండి, దానిని చెల్లించే స్థోమత లేకపోవడం, ఆస్తులపై జప్తు ఉత్తర్వులు ఉండటం లేదా కోర్టు ఉత్తర్వుల అమలు సందర్భంగా అరెస్టు కావడం వంటి పరిస్థితుల్లో దివాలా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా రుణదాత కూడా చట్టంలో పేర్కొన్న షరతులు నెరవేరితే పిటిషన్ దాఖలు చేయవచ్చు.
దివాలా పిటిషన్ను సంబంధిత జిల్లా కోర్టులో దాఖలు చేయాలి. సాధారణంగా రుణగ్రహీత నివసించే జిల్లా, వ్యాపారం నిర్వహించే ప్రాంతం లేదా అతను నిర్బంధంలో ఉన్న జిల్లా కోర్టుకు ఈ పిటిషన్ సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు అప్పుల పూర్తి వివరాలు, రుణదాతల జాబితా, ఆస్తులు–అప్పుల సమాచారం, వ్యక్తిగత వివరాలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పిటిషన్లో వాస్తవాలు, కారణాలు, ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా పేర్కొనడం అవసరం.
పిటిషన్ అందిన తర్వాత కోర్టు ఇరు పక్షాల వాదనలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించి దానిని స్వీకరించాలా లేదా తిరస్కరించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. అవసరమైతే ఒక రిసీవర్ను నియమించి ఆస్తుల నిర్వహణ చేపడుతుంది. దివాలా ప్రకటించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు భావిస్తే, సంబంధిత వ్యక్తి లేదా సంస్థను అధికారికంగా దివాలా తీసినట్లుగా ప్రకటించి, చట్టంలో నిర్దేశించిన ప్రాధాన్యత క్రమం ప్రకారం వారి ఆస్తులను రుణదాతల మధ్య పంపిణీ చేసే ప్రక్రియను కొనసాగిస్తుంది.
Warangal,Telangana
Jul 15, 2026 10:17 PM IST
