Last Updated:
ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అనుసరించిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోసాలు చేయడంలో సదరు గొడ్డలి పార్టీ నేతలు దిట్టలని ఆయన ఎద్దేవా చేశారు.
Chandrababu Naidu: వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకుంటామని, వారి త్యాగాలు ఎంతమాత్రం వృథా కావని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శనివారం వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు, లబ్ధిదారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు పూర్తి న్యాయం చేస్తామని ప్రకటించారు. పునరావాసం కింద రైతులకు రూ.300 కోట్లు అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
“వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. సుంకేసుల గ్యాప్ పనులను మేము 1998లోనే ప్రారంభించాం. గత ప్రభుత్వాలు కూడా మా తరహాలోనే బాధ్యతాయుతంగా పనిచేసి ఉంటే ఈ ప్రాంత పరిస్థితి మరోలా ఉండేది. మార్కాపురం జిల్లాలో పండ్ల తోటలు బాగా వృద్ధి చెందాలి. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి అర్హులైన అందరికీ లబ్ధి చేకూరుస్తాం.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అనుసరించిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోసాలు చేయడంలో సదరు గొడ్డలి పార్టీ నేతలు దిట్టలని ఆయన ఎద్దేవా చేశారు. వైకాపా నాయకులు కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెబుతున్నారని, ఇప్పుడు కూడా వితండవాదానికి దిగుతున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు పేరుతో గత వైకాపా ప్రభుత్వం అనేక మోసాలకు పాల్పడిందని, టన్నెల్-2లో బోర్ ఇరుక్కుపోయినప్పటికీ కనీసం పట్టించుకోకుండా ప్రాజెక్టును ప్రారంభించేశారని చంద్రబాబు విమర్శించారు.
నాలుగు జిల్లాలకు లబ్ధి.. చుట్టుపక్కల భూములకు పెరగనున్న విలువ
ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగం ఎంతో గొప్పదని సీఎం కొనియాడారు. రైతులు ఇచ్చిన భూముల వల్లే రాబోయే రోజుల్లో నాలుగు, ఐదు జిల్లాలు బాగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వెలిగొండ నీళ్లు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల విలువ భారీగా పెరుగుతుందని, ఈ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులను చక్కదిద్దేందుకు, ఆయా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న కలెక్టర్ను ఇక్కడ నియమించినట్లు సీఎం తెలిపారు.
ఈ ఉన్నత స్థాయి పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Hyderabad,Telangana

