Last Updated:
ఆంధ్రప్రదేశ్లో 3 రోజులు వర్షాలు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే నైరుతి ఋతుపవన ద్రోణి ఉత్తర భారతదేశం మీదుగా బంగాళాఖాతం వరకు కొనసాగుతుండటంతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని అధికారులు వివరించారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జూలై 3న ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు, రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జూలై 4, 5 తేదీల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలుల తీవ్రత కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేపట్టాలని వాతావరణ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Visakhapatnam,Andhra Pradesh
