Last Updated:
పిల్లలు ఏఐని బాధ్యతగా వాడేలా అవగాహన పెంచాలి. గోప్యత, తప్పుడు సమాచారం, వయసుకు సరిపోని కంటెంట్, అతిగా ఆధారపడటం వంటి ప్రమాదాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు పిల్లల చదువు, వినోదం, రోజువారీ డిజిటల్ జీవితంలో కూడా భాగమవుతోంది. ఏఐ టూల్స్ పిల్లల్లో ఆసక్తి, సృజనాత్మకత పెంచగలిగినా… వాటిని వాడేటప్పుడు వచ్చే ప్రమాదాల గురించి కూడా పిల్లలకు అవగాహన ఉండాలి. సోనాటైప్ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా కంట్రీ హెడ్ అభిషేక్ చౌహాన్ న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ, ఏఐ అంటే పిల్లలు భయపడేలా చేయడం లక్ష్యం కాకూడదని అన్నారు. దాన్ని బాధ్యతగా వాడేలా పిల్లల్లో సరైన అవగాహన, విచక్షణ పెంచాలని సూచించారు. “పిల్లలు ఏఐకి భయపడేలా చేయడం లక్ష్యం కాదు. ఆసక్తిగా, బాధ్యతగా, సరైన ఆలోచనతో దాన్ని ఎలా వాడాలో వారికి నేర్పించాలి” అని ఆయన చెప్పారు. పిల్లలు ఏఐ వాడేటప్పుడు ఎదుర్కొనే ప్రధాన ప్రమాదాలను నాలుగు రకాలుగా చూడొచ్చని అభిషేక్ చౌహాన్ చెప్పారు. అవి గోప్యత, తప్పుడు సమాచారం, పిల్లల వయసుకు సరిపోని కంటెంట్, ఏఐపై అతిగా ఆధారపడటం అని వివరించారు.

