Last Updated:
ఆగస్టు 2026లో భారత ఆటో మార్కెట్ వృద్ధి చెందింది. టయోటా, కియా, టాటా మోటార్స్, మహీంద్రా అమ్మకాలు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువ.
ఆగస్టు 2026లో భారత్లో ఆటో మార్కెట్ జోరు కొనసాగింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ప్యాసింజర్ వాహనాలు, ఎస్యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, కమర్షియల్ వాహనాల అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదు చేశాయి. కొత్త మోడళ్లు, కస్టమర్లలో కొనసాగుతున్న డిమాండ్, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) ఆగస్టు 2026లో మొత్తం 32,842 వాహనాలు విక్రయించింది. ఇందులో దేశీయ మార్కెట్లో 28,410 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరో 4,432 యూనిట్లను ఎగుమతి చేసింది. 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు టీకేఎం మొత్తం 2,66,696 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. 2025లో ఇదే కాలంలో 2,41,733 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏడాది ప్రాతిపదికన 10 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ అమ్మకాలు 11 శాతం పెరిగి 2,44,592 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 2 శాతం పెరిగి 22,104 యూనిట్లకు చేరుకున్నాయి.

