కేంద్ర ప్రభుత్వం బంగారంతో పాటు వెండి, ప్లాటినం దిగుమతి సుంకాల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుంకం తగ్గింపు ఉంటుందా, ఉంటే ఎప్పుడు అమలు చేస్తారు, ఎంత మేరకు తగ్గిస్తారు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వెండి, ప్లాటినాలకు బంగారం మాదిరిగానే పెట్టుబడి, సేఫ్హేవెన్ డిమాండ్ ఉన్నప్పటికీ వాటికి పారిశ్రామిక రంగంలోనూ భారీ వినియోగం ఉంది. వెండిని సౌర విద్యుత్ రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఆటోమొబైల్, వైద్య రంగాల్లో కీలకంగా వినియోగమవుతోంది. అందువల్ల అధిక దిగుమతి సుంకాలు విదేశీ మారక నిల్వలను రక్షించడంలో సహాయపడినా, పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల ధరలను పెంచి ఇన్పుట్ ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
