Last Updated:
తొలిసారి ఉద్యోగంలో చేరే అర్హత కలిగిన యువతకు కేంద్ర ప్రభుత్వం రూ.15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తోంది. అంతేకాదు, కొత్త ఉద్యోగాలను కల్పించే కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగిపై నెలకు రూ.3,000 చొప్పున ప్రయోజనం లభిస్తుంది. ఈ రెండు వర్గాలకు ప్రయోజనం కల్పించే PM-VBRY పథకం గురించి చాలామందికి ఇంకా పూర్తి అవగాహన లేదు. అసలు ఈ స్కీమ్కు ఎవరు అర్హులు? డబ్బులు ఎప్పుడు వస్తాయి? కంపెనీలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు EPFO సెప్టెంబర్ 8న ప్రత్యేక లైవ్ సెషన్ నిర్వహించనుంది.
భారతదేశంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించడం, ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఆర్థికపరమైన లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకం ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ (PM-VBRY). ఈ పథకం పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, కంపెనీల యాజమాన్యాల్లో ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, సెప్టెంబర్ 8వ తేదీ (మంగళవారం) నాడు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష ప్రసార సమావేశాన్ని (లైవ్ సెషన్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.

