Last Updated:
IT Notice | ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చే వాట్సాప్ మెసేజ్లపై పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ రిఫండ్ లింక్లు, ఫేక్ ట్యాక్స్ నోటీసులు, వ్యక్తిగత వివరాల దోపిడీ నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం.
వాట్సప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అధికారిక సమాచారాన్ని పంపే విధానం పెరుగుతున్న నేపథ్యంలో ఫిషింగ్ మెసేజ్లు, నకిలీ గుర్తింపు మోసాలపై పన్ను చెల్లింపుదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చే వాట్సప్ మెసేజ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ సంస్థ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల హెచ్చరించారు. ప్రతి మెసేజ్ను పరిశీలించి నిజమా కాదా తెలుసుకున్న తర్వాతే స్పందించాలని ఆయన న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు. పన్ను చెల్లింపుదారులు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించారు. “ముందు వెరిఫై చేయండి.. తర్వాతే చర్య తీసుకోండి” అనే అలవాటు పెంచుకోవాలని పన్ను చెల్లింపుదారులకు సూచించారు. ఎందుకంటే ఐటీఆర్లో సమస్య ఉందని, రీఫండ్ పెండింగ్లో ఉందని, ట్యాక్స్ డిమాండ్ వచ్చిందని లేదా పాన్ కార్డు బ్లాక్ అవుతుందని వచ్చే నకిలీ మెసేజ్లు ఒక్క క్లిక్తోనే ఆర్థిక మోసాలకు దారి తీసే ప్రమాదం ఉంది. “ముందు క్లిక్ చేసి తర్వాత వెరిఫై చేయడం కంటే, ముందుగా వెరిఫై చేసి ఆ తర్వాతే చర్య తీసుకోవడం సురక్షితం. ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చినట్లుగా కనిపించే మెసేజ్లు భయాన్ని కలిగించవచ్చు. కానీ తొందరపాటు, ఆందోళన వల్ల వెరిఫికేషన్ను మర్చిపోకూడదు” అని అఖిల్ కంచర్ల చెప్పారు.

