Last Updated:
తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ ఆత్మహత్యతో కథ ముగిసినా.. ఈ కేసులోని కీలక ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ ఆత్మహత్యతో కథ ముగిసినా.. ఈ కేసులోని కీలక ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. పోక్సో కేసు నమోదు చేసిన బాలిక కుటుంబంపై కక్షతో బాలిక, ఆమె తల్లి, నానమ్మను దారుణంగా హత్య చేసిన రాజ్కుమార్ అనంతరం తన భార్య సరిత, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చడం వెనుక అసలు కారణమేంటన్నది ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది. ఈ అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా లభించిన సెల్ఫీ వీడియోలో రాజ్కుమార్ పోక్సో కేసు, బాలిక కుటుంబంపై తనకున్న ఆగ్రహం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే తన భార్య, పిల్లలను కూడా చంపాలని నిర్ణయించుకున్నానని చెప్పినప్పటికీ అందుకు గల కారణాలను మాత్రం వీడియోలో స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో భార్య, ఇద్దరు చిన్నారులను ఎందుకు హత్య చేశాడన్న ప్రశ్న దర్యాప్తులో ప్రధాన అంశంగా మారింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. రాజ్కుమార్ దాదాపు ఏడాది కాలంగా ఓ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం అతని భార్య సరితకు తెలియడంతో పలుమార్లు అతడిని నిలదీసింది. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదు చేయడంతో షాబాద్ పోలీస్ స్టేషన్లో రాజ్కుమార్పై పోక్సో కేసు నమోదైంది.
పోక్సో కేసు నమోదు కావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు సమాచారం. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించాలని సరిత ప్రయత్నించినా అప్పటికే రాజ్కుమార్ పరారీలో ఉండటంతో అది సాధ్యం కాలేదు. అనంతరం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన రాజ్కుమార్ మళ్లీ గ్రామానికి తిరిగి వచ్చాడు.
గ్రామానికి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని స్థానికులు చెబుతున్నారు. బాలికను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని రాజ్కుమార్ పట్టుబట్టడంతో కుటుంబంలో గొడవలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితుల్లో తన పెద్ద కుమారుడిని మొయినాబాద్లోని మేనమామ ఇంటికి పంపించిన సరిత, పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే కొద్దిరోజుల తర్వాత ఇకపై సక్రమంగా ఉంటానని కుటుంబ సభ్యులకు నమ్మకం కల్పించిన రాజ్కుమార్, మేనమామ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో కుటుంబ పరిస్థితులు సద్దుమణిగాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అదే కుటుంబంపై రాజ్కుమార్ దారుణానికి పాల్పడ్డాడు.
ఈ నెల 11వ తేదీ రాత్రి భార్య సరిత, ఇద్దరు పిల్లలను హత్య చేసిన అనంతరం పోక్సో కేసులో బాధితురాలైన బాలిక, ఆమె తల్లి, నానమ్మను కూడా అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారైన రాజ్కుమార్ కొద్ది రోజుల తర్వాత కొత్తూరు సమీపంలో ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించాడు.
భార్య తన అక్రమ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ, అమాయకులైన ఇద్దరు చిన్నారులను కూడా ఎందుకు హత్య చేశాడన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆవేశంలో చేశాడా? లేక ముందే పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
రాజ్కుమార్ మరణంతో కేసులో కీలక నిందితుడి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయినా.. అతని సెల్ఫోన్, సెల్ఫీ వీడియో, కాల్ డేటా, కుటుంబ సభ్యులు, గ్రామస్థుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు ఈ కేసులోని మిగిలిన చిక్కుముడులను విప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Hyderabad,Telangana

