Last Updated:
తెలంగాణ ప్రభుత్వం బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 ఉచిత కోచింగ్ అందిస్తుంది. ఆగస్టు 24, 2026 నుండి తరగతులు ప్రారంభం.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీసీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని టీజీ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రం (TGBCESDTC) ద్వారా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల కోసం ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ అందించనున్నారు. ఈ కోచింగ్కు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కోచింగ్ కార్యక్రమం ఆగస్టు 24, 2026 నుంచి మే 2027 వరకు హైదరాబాద్లోని సైదాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 150 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. వీరిలో 100 మందిని ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయగా, గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన 50 మందికి స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు కోచింగ్తో పాటు పలు ప్రత్యేక సౌకర్యాలు కూడా అందించనున్నారు. ప్రతి నెల రూ.5,000 స్టైపెండ్, ఒకసారి రూ.5,000 పుస్తక నిధి, గ్రంథాలయ సౌకర్యం, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, సబ్జెక్ట్వారీ పరీక్షలు, మూల్యాంకనం, వ్యక్తిగత మెరుగుదల సూచనలు వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. యూపీఎస్సీ పరీక్షలకు సమగ్రంగా సిద్ధమయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలలోపు ఉండాలి. అభ్యర్థులు ఎలాంటి ఉద్యోగంలో ఉండకూడదని, ఇతర విద్యా కోర్సులు చదువుతూ ఉండకూడదని, అలాగే ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి ఉచిత కోచింగ్ పొందకూడదని స్పష్టం చేశారు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జూలై 17 నుంచి ఆగస్టు 7, 2026 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 13 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 16న స్క్రీనింగ్ పరీక్ష, ఆగస్టు 19న ఫలితాలు, ఆగస్టు 21 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 24 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు TGBC స్టడీ సర్కిల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
Karimnagar,Telangana

