Last Updated:
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పులు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 3 రోజులు మిశ్రమ వాతావరణం, బలమైన గాలులు, వర్షాలు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు మిశ్రమ వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూలై 15న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణంగా పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
జూలై 16 నుంచి పరిస్థితుల్లో మార్పు కనిపించే అవకాశముంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కొనసాగవచ్చని అధికారులు పేర్కొన్నారు.
అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో జూలై 16, 17 తేదీల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసినా వేడి, తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో కూడిన అసౌకర్యకర వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హెచ్చరించారు.
జూలై 17న ఉత్తర కోస్తా ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది. అయితే ఈ సమయంలో గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్య ఉండే అవకాశం ఉందని, వర్షాలతో పాటు ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ఏర్పడే అవకాశాల నేపథ్యంలో మత్స్యకారులు, రైతులు, ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే తాజా బులెటిన్లను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయ పనులు చేపట్టే రైతులు కూడా స్థానిక వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Visakhapatnam,Andhra Pradesh
Jul 14, 2026 11:08 PM IST

