Last Updated:
గత నెల జూన్ 14న రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 20.35 కోట్ల యూనిట్లుగా ఉండగా, సరిగ్గా నెల తిరిగేసరికి జూలై 14 నాటికి అది ఏకంగా 30.90 కోట్ల యూనిట్లకు చేరుకుంది.
Telangana: ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోత తీవ్రమవ్వడంతో విద్యుత్ వినియోగం మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రోజువారీ విద్యుత్ వినియోగం ఏకంగా 10 కోట్ల యూనిట్లు పెరిగి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
రాష్ట్రంలో ఎండలు, ఉక్కపోత తీవ్రత ఏ స్థాయిలో ఉందో విద్యుత్ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గత నెల జూన్ 14న రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 20.35 కోట్ల యూనిట్లుగా ఉండగా, సరిగ్గా నెల తిరిగేసరికి జూలై 14 నాటికి అది ఏకంగా 30.90 కోట్ల యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది (2025) జూలై 14న నమోదైన 28.60 కోట్ల యూనిట్లతో పోల్చినా ఈసారి వినియోగం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
సాధారణంగా వర్షాకాలంలో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ తగ్గుతుంది. కానీ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు పంటలను కాపాడుకోవడానికి పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడుతున్నారు. మరోవైపు గాలిలో తేమ, ఉక్కపోత కారణంగా ఇళ్లు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, ఐటీ సంస్థలు, ఆసుపత్రులలో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు), కూలర్లు, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. జూలై మొదటి రెండు వారాల్లో (జూలై 1 నుంచి 14 వరకు) గత ఏడాది 95.77 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, ఈ ఏడాది అదే సమయానికి 107.84 కోట్ల యూనిట్లకు చేరింది.
ఈ విధంగా పెరుగుతున్న రికార్డు స్థాయి డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర డిస్కమ్లు అదనపు విద్యుత్ను కొనుగోలు చేస్తూ భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. వినియోగదారులకు, రైతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని రకాల ప్రత్యేక నిర్వహణ చర్యలు చేపట్టామని దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేశ్ పాటిల్ వెల్లడించారు.
Hyderabad,Telangana

