ఈ పర్యటనలో ముందుగా బిర్లా మందిర్ను సందర్శిస్తారు. అనంతరం నిజాం పాలన వైభవాన్ని ప్రతిబింబించే చౌమహల్లా ప్యాలెస్కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్మినార్, మక్కా మసీదు సందర్శన ఉంటుంది. అనంతరం లాడ్ బజార్లో కొంత సమయం షాపింగ్కు కేటాయిస్తారు. ముత్యాలు, గాజులు, సంప్రదాయ ఆభరణాలకు ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని అరుదైన కళాఖండాలు, చారిత్రక వస్తువులు, శిల్పాలు, ఆయుధాలు, చిత్రాలు ప్రదర్శనలో ఉంటాయి. ఇదే సమయంలో భోజన విరామం కూడా ఉంటుంది. అనంతరం పురానీ హవేలీలోని నిజాం మ్యూజియం (నిజాం జూబ్లీ పెవిలియన్)ను సందర్శిస్తారు. ఆ తర్వాత చారిత్రక గోల్కొండ కోటను వీక్షించి, చివరగా వాహనంలో ప్రయాణిస్తూ కుతుబ్ షాహీ సమాధులను బయటి నుంచి చూపిస్తారు. అనంతరం లుంబినీ పార్క్/ఐమ్యాక్స్ రోడ్, ఖైరతాబాద్ వద్ద టూర్ ముగుస్తుంది.
ప్రతి శుక్రవారం చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం మూసివేయబడే కారణంగా టూర్ షెడ్యూల్లో మార్పులు ఉంటాయి. ఆ రోజు వాటి స్థానంలో నెహ్రూ జూ పార్క్ సందర్శనను చేర్చారు. అలాగే చంచల్గూడ జైలులో నిర్వహించే ప్రత్యేక ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమాన్ని కూడా పర్యాటకులు అనుభవించే అవకాశం ఉంటుంది. దీంతో శుక్రవారం మొత్తం 7 ప్రదేశాలు, మిగిలిన రోజుల్లో 9 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా టూర్ను నిర్వహిస్తున్నారు.
పర్యాటకుల సౌకర్యార్థం నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సు సదుపాయం కల్పించారు.
ఉదయం 7:30 గంటలకు – TGTDC యాత్రి నివాస్, ఎస్.పీ.రోడ్, సికింద్రాబాద్
ఉదయం 7:45 గంటలకు – టూరిజం ప్లాజా, బేగంపేట
ఉదయం 8:15 గంటలకు – CRO శంకర్ భవన్, బషీర్బాగ్
టూర్ ముగిసిన తర్వాత ఐమ్యాక్స్ రోడ్ వద్ద దింపుతారు. పర్యాటకుల అభ్యర్థన మేరకు హిమాయత్నగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా దిగే అవకాశం కల్పిస్తున్నారు.
హైదరాబాద్ హెరిటేజ్ అండ్ మ్యూజియం టూర్కు పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.440 ఛార్జీగా నిర్ణయించారు. అయితే ఈ ప్యాకేజీలో పర్యాటక ప్రాంతాల ప్రవేశ టికెట్లు, భోజన ఖర్చులు ఉండవు. వాటిని ప్రయాణికులు విడిగా చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ సిటీ హెరిటేజ్ అండ్ మ్యూజియం టూర్లో పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. సీట్లు పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా వారాంతాలు, సెలవు రోజుల్లో ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం మంచిది.
1. TGTDC సమాచార & రిజర్వేషన్ కార్యాలయం – యాత్రి నివాస్, సికింద్రాబాద్
రిపోర్టింగ్ సమయం: ఉదయం 7:30 గంటలకు
చిరునామా: యాత్రి నివాస్, ఎస్.పీ. రోడ్, సికింద్రాబాద్
ఫోన్: 9848126947
2. TGTDC టూరిజం ప్లాజా – బేగంపేట
రిపోర్టింగ్ సమయం: ఉదయం 7:45 గంటలకు
చిరునామా: టూరిజం ప్లాజా, బేగంపేట, హైదరాబాద్
ఫోన్: 98483 06435
3. CRO బుకింగ్ పాయింట్ – బషీర్బాగ్
రిపోర్టింగ్ సమయం: ఉదయం 8:15 గంటలకు
చిరునామా: గ్రౌండ్ ఫ్లోర్, శంకర్ భవన్, CCS పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా, టాటా మోటార్స్ పక్కన, బషీర్బాగ్, హైదరాబాద్
ఫోన్: 98485 40371
పర్యాటకులు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్(https://tgtdc.in/package/hyderabadcitytour) ద్వారా కూడా ఈ టూర్ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. టూర్ తేదీ, అందుబాటులో ఉన్న సీట్లు, ఛార్జీలు, ఇతర వివరాలను అక్కడే తెలుసుకోవచ్చు. అలాగే తెలంగాణ టూరిజం హెల్ప్డెస్క్ను సంప్రదించి కూడా రిజర్వేషన్కు సంబంధించిన సమాచారం పొందవచ్చు.
