Last Updated:
బ్యాంక్ ఆఫ్ బరోడాపై సైబర్ దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి. 1 టీబీ కస్టమర్ డేటా లీక్ అయింది. ఆధార్, ఖాతా వివరాలు, లోన్ అప్లికేషన్లు బహిర్గతం అయ్యాయి.
బ్యాంకింగ్ రంగంలో డేటా భద్రతపై ఆందోళన పెంచే ఘటన చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాపై సైబర్ దాడి జరిగిందని, దాదాపు 1 టీబీ పరిమాణంలో కస్టమర్లకు సంబంధించిన సున్నితమైన సమాచారం లీక్ అయిందని ఓ హ్యాకర్ గ్రూప్ పేర్కొన్నట్టు సీఎన్బీసీటీవీ18 కథనం వెల్లడించింది. ఆ కథనం ప్రకారం లీక్ అయిన డేటాలో ఆధార్ వివరాలు, సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాల రికార్డులు, రుణ దరఖాస్తులు, నెట్బ్యాంకింగ్ సమాచారం, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారీ సైబర్ దాడి జరిగిందని, దాడి చేసిన వారు దాదాపు 1 టీబీ సున్నితమైన కస్టమర్ సమాచారం, బ్యాంక్ అంతర్గత డేటాను ఉచితంగా ఆన్లైన్లో విడుదల చేశారని సమాచారం.
ఈ దాడి వెనుక ట్రిపుల్ఎక్స్ అనే కొత్తగా కనిపిస్తున్న హ్యాకింగ్ గ్రూప్ ఉందని డార్క్ వెబ్ పర్యవేక్షణ సంస్థ ర్యాన్సమ్వేర్.లైవ్ తెలిపింది. జూలై 24న ఆ గ్రూప్ చేసిన లిస్టింగ్ ప్రకారం, లీక్ అయిన డేటాలో 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కస్టమర్ ఫారమ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్యాంక్ ఖాతాలు తెరవడానికి కస్టమర్లు సమర్పించిన ఫొటోలు, గుర్తింపు పత్రాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. లీక్ అయిన సమాచారంలో ఆధార్ వివరాలు, సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాల వివరాలు, లోన్ అప్లికేషన్లు, నెట్బ్యాంకింగ్ సమాచారం, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ సేవలు, కార్పొరేట్ బ్యాంకింగ్కు సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్, క్యాష్లెస్కన్స్యూమర్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ లక్ష్మణన్ కూడా ఎక్స్లో ఈ దాడి గురించి హెచ్చరించారు. దాడి చేసిన వారు షేర్ చేసిన కొన్ని నమూనా ఫైళ్లను పరిశీలించానని ఆయన చెప్పారు. వాటిలో అంతర్గత పత్రాలు, బ్రాంచ్ ఆడిట్ వివరాలు, లోన్ అప్రైజల్ పేపర్లు, విజిలెన్స్ దర్యాప్తు పత్రాలు, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ ఆడిట్ రిపోర్టులు, దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ల కస్టమర్ అప్లికేషన్ ఫారమ్లు కనిపించాయని తెలిపారు. “ఇది ఒక సైబర్ విపత్తు” అని శ్రీకాంత్ లక్ష్మణన్ అన్నారు.
ఇంతకుముందు కూడా ట్రిపుల్ఎక్స్ గ్రూప్ ఇండోనేషియాకు చెందిన ప్రభుత్వ బ్యాంక్ బ్యాంక్ నెగారా ఇండోనేషియా నుంచి దాదాపు 2 టీబీ డేటాను దొంగిలించామని మే నెలలో ప్రకటించింది. ఈ ఆరోపణలపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) కూడా ఈ డేటా లీక్ ఘటనను ధృవీకరించలేదు. కస్టమర్లకు సంబంధించిన బ్యాంకింగ్ సమాచారం లీక్ అయిందన్న ఆరోపణలు నిజమైతే, ఖాతాదారుల వ్యక్తిగత వివరాల భద్రతపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సేవలు ఉపయోగించే వారు తమ నెట్బ్యాంకింగ్ వివరాలు, ఖాతా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
Hyderabad,Telangana

