Last Updated:
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక కసరత్తు ప్రారంభించింది.
రాష్ట్రంలో మొదట మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాతే గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పురపాలక శాఖ పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SR) ప్రక్రియ ముగిసిన వెంటనే.. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చేలోపు ఎన్నికల సన్నద్ధతను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలోని 123 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఉండగా.. కోర్టు కేసుల కారణంగా 2021లో కేవలం రెండు చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగిలిన 23 పుర, నగరపాలక సంస్థల్లో సమీపంలోని 112 గ్రామ పంచాయతీలను విలీనం చేయడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసుల పరిష్కారం కోసం అడ్వొకేట్ జనరల్ (AG)తో పాటు ఇతర న్యాయ నిపుణులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో కాకినాడ నగరపాలక సంస్థలో రెండు డివిజన్లను మినహాయించి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 61 పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చి 17తో ముగియగా, మరో 13 చోట్ల నవంబరులో ముగియనుంది. ఈ నేపథ్యంలో మొత్తం 100 చోట్ల ఎన్నికలు నిర్వహించాలా? లేక 123 చోట్లా జరపాలా? అనే దానిపై ముందస్తుగా స్పష్టత ఇవ్వాలని పురపాలక శాఖను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.
పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా పెండింగ్లో పడింది. పాత జనాభా ఆధారంగా వార్డుల సంఖ్యను 3,816 నుంచి 4,803కి పెంచాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే విశాఖపట్నం, మచిలీపట్నంలో వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, ఈ పునర్విభజన ప్రక్రియకు సమయం సరిపోదని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల పాత డివిజన్లు, వార్డులతోనే ఎన్నికలకు వెళ్లాలా? లేదా హైకోర్టులో కేసులు పరిష్కారమయ్యే వరకు వేచి చూడాలా? అనే గందరగోళం నెలకొంది. ఈ పూర్తి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు జరపాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నందున, త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు.
Hyderabad,Telangana

