Last Updated:
ప్రభుత్వం, పౌరుల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. లైసెన్స్ రాజ్ నాటి శిక్షల విధానం పోయి, ఇప్పుడు ప్రోత్సాహకాల యుగం నడుస్తోందని ఈటీ ఫోరంలో ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య బంధం అనుమానంతో కాకుండా నమ్మకంతో ముడిపడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 21వ శతాబ్దపు భారతదేశం కోసం తమ ప్రభుత్వం కేవలం నిబంధనలను మాత్రమే మార్చడం లేదని, ఆ నిబంధనల వెనుక ఉన్న మూల సిద్ధాంతాన్నే సమూలంగా మారుస్తోందని వెల్లడించారు. గతంలో ఉన్న ‘అనుమతిస్తేనే చేయాలి’ అనే పాత విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టి.. చట్ట ప్రకారం ‘నిషేధిస్తే తప్ప మిగిలినవి చేసుకోవచ్చు’ అనే సరికొత్త స్వేచ్ఛా విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు, వ్యాపారవేత్తలు ప్రతి చిన్న పనికి పదేపదే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా నియంత్రణ సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

