Last Updated:
హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. పూర్తి భద్రతా ధ్రువీకరణ, సాంకేతిక నివేదికలు వచ్చిన తర్వాతే బస్సుల సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలో నడుస్తున్న జేబీఎం (JBM) సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీలకు సంబంధించిన ప్రమాదాలు చోటుచేసుకోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన అన్ని ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ జూలై 2, 2026న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
గత నెల జూన్ 21న ఉదయం కరీంనగర్ సమీపంలోని అలుగునూర్ వద్ద జరిగిన ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక రాకముందే మరో ప్రమాదం జరగడం ఆర్టీసీని అప్రమత్తం చేసింది. ప్రయాణికులు, డ్రైవర్లు, సిబ్బంది, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో జేబీఎం సంస్థను పలు కీలక అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆర్టీసీ కోరింది. ప్రమాదాలపై సాంకేతిక విశ్లేషణ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకునే శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రం, హైదరాబాద్ బస్ భవన్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపై పూర్తి వివరాలు అందించాలని సూచించింది.
ఆర్టీసీ విజ్ఞప్తికి స్పందించిన జేబీఎం సంస్థ తమ సాంకేతిక నిపుణులతో పాటు చైనా నుంచి ప్రత్యేక బ్యాటరీ నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపింది. ఇటీవల జరిగిన ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తూ, సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాలు, నివారణ చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
జేబీఎం సమర్పించే నివేదికలను ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించనుంది. సంస్థ విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను పూర్తిగా అమలు చేసినట్లు నిర్ధారించిన తర్వాతే, “Vehicle Fit for Operation” ధ్రువీకరణ పొందిన బస్సులను తిరిగి రోడ్లపైకి అనుమతించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన అగ్నిప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కరీంనగర్ ఆర్టీసీ రెండో డిపోలో పార్కింగ్లో ఉన్న ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ఇటీవల మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, బ్యాటరీ వ్యవస్థలో లోపమా లేదా ఇతర సాంకేతిక సమస్యలే కారణమా అనే దానిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి మూడో ప్రమాదం కావడం గమనార్హం. అంతకుముందు తిమ్మాపూర్ సమీపంలో జరిగిన ప్రమాదంపై కూడా తుది నివేదిక ఇంకా వెలువడలేదు. అన్ని నివేదికలు పరిశీలించి, భద్రతపై పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే ఎలక్ట్రిక్ బస్సుల సేవలను పునరుద్ధరిస్తామని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రజారవాణా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని యాజమాన్యం మరోసారి వెల్లడించింది.
Hyderabad,Telangana

