Last Updated:
బీఎస్-6 వాహనాలకు పీయూసీసీ గడువు పెంచే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. MoRTH ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
వాహన యజమానులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఆరు సంవత్సరాల లోపు ఉన్న బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ప్రైవేట్ వాహనాలకు కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం (పీయూసీసీ) గడువును ప్రస్తుత ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల వాహన యజమానులు తరచూ పీయూసీసీ పునరుద్ధరణ చేసుకోవాల్సిన భారం తగ్గనుంది. పీటీఐ ప్రకారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో ఈ ప్రతిపాదనను వెల్లడించింది. దీని ప్రకారం ఆరు నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బీఎస్-6 వాహనాలు పీయూసీసీ సర్టిఫికెట్ను పునరుద్ధరించుకోవాలి. పది సంవత్సరాలు దాటిన బీఎస్-6 వాహనాలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పీయూసీసీ పునరుద్ధరణ అవసరం అవుతుంది.
ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం, బీఎస్-4 కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అన్ని మోటార్ వాహనాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పీయూసీసీని పునరుద్ధరించుకోవాలి. అలాగే బీఎస్-1, బీఎస్-2, బీఎస్-3 ప్రమాణాలకు చెందిన వాహనాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి పీయూసీసీని రీన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్ అంటే భారత్ స్టేజ్. ఇది భారతదేశంలో వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అమలు చేసే ఉద్గార ప్రమాణాలు. వీటి ద్వారా కార్బన్ మోనాక్సైడ్ (CO), నైట్రోజన్ ఆక్సైడ్స్ (NOx), హైడ్రోకార్బన్స్ (HC), పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) వంటి కాలుష్య కారకాల స్థాయికి పరిమితులు నిర్ణయిస్తారు.
ఈ ప్రమాణాలు యూరప్లో అమల్లో ఉన్న వాహన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఎక్కువ స్థాయిలో కాలుష్యం విడుదల చేసే వాహనాలను క్రమంగా తగ్గించేందుకు వీటిని అమలు చేస్తున్నారు. బీఎస్-4 ప్రమాణాలు 2017 నుంచి 2020 వరకు అమల్లో ఉన్నాయి. బీఎస్-6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చాయి. కాలుష్య నియంత్రణను వేగవంతం చేయడానికి భారత్ బీఎస్-5 దశను దాటేసి నేరుగా బీఎస్-6 ప్రమాణాలకు మారింది. బీఎస్-6 వాహనాలు చాలా తక్కువ స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. ఈ వాహనాలకు తక్కువ సల్ఫర్ కలిగిన బీఎస్-6 ఇంధనం అవసరం అవుతుంది.
Hyderabad,Telangana

