ఈ అంశంపై రంగారెడ్డి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ రవి కుమార్ వాధ్యారపు న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ కీలక విషయాలను వివరించారు. ఆయన మాటల్లో, స్వయంగా సంపాదించిన ఆస్తిపై యజమానికి పూర్తి హక్కు ఉంటుందని, ఆ ఆస్తిని ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి లేదా ఇతర ఆస్తిని పిల్లల్లో ఒక్కరికి మాత్రమే బహుమతిగా (Gift Deed) ఇవ్వవచ్చని, లేదా విల్ (Will) ద్వారా కూడా ఒకే వ్యక్తికి కేటాయించవచ్చని తెలిపారు. అలాంటి సందర్భాల్లో సాధారణంగా మిగతా పిల్లలు ఆ ఆస్తిపై హక్కు కోరలేరని ఆయన పేర్కొన్నారు.

