Last Updated:
పలమనేరులో ప్రజలను భయపెట్టిన ఒంటరి ఏనుగును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కుంకీ ఏనుగుల సాయంతో ఆపరేషన్ తస్కర్ విజయవంతమైంది.
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా రైతులను, స్థానికులను, జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఒంటరి ఏనుగు ఎట్టకేలకు అటవీశాఖ అధికారుల చేతికి చిక్కింది. పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతం నుంచి తరచూ జనవాసాల్లోకి వస్తూ పంటలను ధ్వంసం చేయడం, రహదారులపై సంచరిస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టించడం వల్ల ఈ ఏనుగు స్థానికులకు పెద్ద తలనొప్పిగా మారింది. ట్రాకర్ల సాయంతో పలుమార్లు అడవిలోకి మళ్లించినప్పటికీ మళ్లీ జనవాసాల్లోకి వస్తుండటంతో అధికారులు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పలమనేరు అటవీశాఖ అధికారులు కుంకీ ఏనుగులను రంగంలోకి దింపి ఆపరేషన్ తస్కర్ ను ప్రారంభించారు. రెండు రోజుల పాటు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన అధికారులు, కుంకీల సహాయంతో ఆ ఒంటరి ఏనుగు కదలికలను నిశితంగా గమనించారు. చివరకు గురువారం మధ్యాహ్నం సుమారు 2.40 గంటల సమయంలో ఏనుగును చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రత్యేక భద్రత మధ్య ముసలి మడుగు ఎలిఫెంట్ హబ్కు తరలించారు.
అటవీశాఖ అధికారుల సమాచారం ప్రకారం, గత తొమ్మిది నెలలుగా ఈ ఏనుగు గొబ్బిలికొటూరు, భూతలబండ, బండమీద జరావారీపల్లి, టి.ఎస్. అగ్రహారం, పెంగరగుంట, వడ్డూరు తదితర గ్రామాల పరిసరాల్లో సంచరిస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మామిడి తోటలు, వరి, రాగి, ఉద్యాన పంటలతో పాటు హ్యాంగింగ్ సోలార్ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాకుండా పాడి పశువులపై కూడా దాడి చేసిన ఘటనలు నమోదయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో గడిపారు.
ఈ సమస్యను అటవీశాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి యశోధబాయి, జిల్లా అటవీ అధికారి సుబ్బరాజు పర్యవేక్షణలో కుంకీ ఏనుగులతో ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వెటర్నరీ శాఖల సిబ్బంది కూడా కీలకంగా సహకరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా ముగిసింది.
ఎట్టకేలకు నెలల తరబడి ప్రజలను భయపెట్టిన ఒంటరి ఏనుగు పట్టుబడటంతో పలమనేరు పరిసర గ్రామాల రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పంటలకు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న ఏనుగు ఇకపై జనవాసాల్లోకి రాదన్న ఆశతో స్థానికులు అటవీశాఖ అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విజయవంతమైన ఆపరేషన్తో పలమనేరు ప్రాంతంలో నెలకొన్న ఏనుగు భయం తాత్కాలికంగా తగ్గినట్టేనని అధికారులు భావిస్తున్నారు.
Chittoor,Chittoor,Andhra Pradesh
