Last Updated:
శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు.. సొంత ఖర్చులతో ఈ శివభక్తుడు చేస్తున్న సేవ చూస్తే చేతులెత్తి దండం పెడతారు!
ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి సమాజం మొత్తం మెచ్చుకునే గొప్ప సేవామూర్తిగా ఎదగడం బహుశా దైవ సంకల్పమేనేమో. పలమనేరు పట్టణం గంటావూరు బీసీ కాలనీకి చెందిన మురుగన్ జీవన ప్రయాణం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఒకప్పుడు కేవలం చుట్టుపక్కల వారికి మాత్రమే తెలిసిన ఆయన.. కాలక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి అనూహ్యమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో సేవా కార్యక్రమాల్లో అడుగుపెట్టిన ఆయన.. ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా మారారు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వాలిపోయే మురుగన్ దాతృత్వం ఇప్పుడు పలమనేరు పరిసర ప్రాంతాల్లో మారుమోగుతోంది.
తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గుడి అభివృద్ధికి ఆయన అహర్నిశలు ఎనలేని కృషి చేశారు. నిత్య పూజా కైంకర్యాలు, భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల మన్ననలు పొందారు. కేవలం తన గుడికే పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణాల్లో శిథిలావస్థకు చేరిన ఎన్నో దేవాలయాల పునరుద్ధరణకు తనవంతు భారీగా ఆర్థిక సాయం అందించారు. సమాజానికి ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించిన పలు సంస్థలు డబుల్ డాక్టరేట్తో సత్కరించాయి. దీంతో ‘సేవారత్న’ డాక్టర్ మురుగన్గా పేరుగాంచిన ఆయన, సమాజంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ నిర్విరామంగా సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
తాజాగా పలమనేరు మండలం దేవలంపేటలో కొలువుదీరిన ప్రసిద్ధ శ్రీ వందన మల్లేశ్వర స్వామి భక్తుల కష్టాలను తీర్చేందుకు మురుగన్ దేవుడిలా ముందుకొచ్చారు. ఈ ప్రాచీన ఆలయానికి అమావాస్య, పౌర్ణమి, సోమవారాల్లో భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. అయితే అక్కడికి వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రవాణా సమస్యను కొంతమంది భక్తులు నేరుగా మురుగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ భక్తుల కష్టాన్ని అర్థం చేసుకున్న ఆయన తక్షణమే స్పందించి, స్వామివారి దర్శనానికి వెళ్లేవారి కోసం తన సొంత ఖర్చులతో పూర్తి ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు.
వచ్చే వారం నుంచి ప్రతి సోమవారంతో పాటు పౌర్ణమి రోజుల్లో ఉచిత ఆటో సేవలు అందుబాటులోకి రానున్నాయి. పలమనేరు పట్టణంలోని సరస్వతి కేఫ్ ఎదురుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆటోలు భక్తుల కోసం నిరంతరాయంగా నడుస్తాయి. ఈ మేరకు ఇటీవల వందన మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న మురుగన్కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. గత మహాశివరాత్రి పర్వదినాన కూడా ఆయన సుమారు 15 ఉచిత ఆటోలను నడిపించి వేలాది మందికి దర్శన భాగ్యం కల్పించారని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ రోజు మూగజీవాలకు పశుగ్రాసం అందించడం, రోజంతా అన్నదానం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.
శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదని, భక్తులకు సేవ చేయడమే పరమేశ్వరుడికి చేసే నిజమైన సేవ అని మురుగన్ స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా తన ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని నిత్యం పూజలు చేస్తున్న భక్తుడిగా, స్వామివారి దర్శనానికి ఎవరూ ఇబ్బంది పడకూడదనే దృఢ సంకల్పంతోనే ఈ ఉచిత రవాణా సేవలు ప్రారంభించినట్లు వెల్లడించారు. భక్తులందరూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పరమశివుడి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. స్వార్థం లేని మురుగన్ సేవా దృక్పథాన్ని, ఆయన దాతృత్వాన్ని స్థానికులు, భక్తులు మనసారా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Chittoor,Chittoor,Andhra Pradesh
