Last Updated:
Murder: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య తన భర్తను నమ్మించి ఆలయానికి తీసుకెళ్లి, ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.
హత్య అనంతరం భర్త బైక్పైనే నిందితులతో కలిసి ఆమె పరారవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. తమిళనాడులోని శూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్, హోసూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇతనికి కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న పాప కూడా ఉంది. ఇటీవల వీరంతా కలిసి బోయనపల్లెలోని హాసిని పుట్టింటికి వచ్చారు.
మంగళవారం రోజున రమేష్, హాసిని తన పాపతో కలిసి సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి బైక్పై బయల్దేరారు. అయితే, రాత్రి దాటినా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. గుడికి వెళ్లేటప్పుడు భర్త, పాపతో కలిసి వెళ్లిన హాసిని.. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం భర్త తెచ్చిన బైక్పైనే మరో ఇద్దరు గుర్తుతెలియని యువకులతో కలిసి వెళ్తున్నట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఆధారాలతో పోలీసులు మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, అక్కడ రమేష్ రక్తసిక్తమైన మృతదేహం లభించింది.
తన వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోనే హాసిని మరో ఇద్దరు యువకులతో కలిసి ఈ పక్కా ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Hyderabad,Telangana

