Last Updated:
ఎండిపోతున్న పంటలు, కన్నీళ్లు పెడుతున్న రైతులు.. ప్రభుత్వానికి రక్తాన్ని దానం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఎందుకో తెలుసుకోండి!
కండ్ల ముందే ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఎండిపోతున్న CM రేవంత్ రెడ్డి రైతన్నలకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని, అడిగితే మిమ్మల్ని కోసి మీ రక్తాన్ని పంటల మీదే చల్లితే పంటలు పండుతాయి అని రైతులను కించపరిచే విధంగా మాట్లాడడం సీఎం స్థాయికి సిగ్గుచేటని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.
KCR, KTR, హరీశ్రావులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణములోని చల్మెడ నివాసంలో రేవంత్రెడ్డికి రక్తదానం పేరుతో శిబిరం ఏర్పాటు చేసి BRS శ్రేణులతో కలిసి రక్తదానం చేసి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్మినరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి కోసం, స్థాయిని మరిచి మాటలు మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు.
కాలేశ్వరం నీళ్లను వెంటనే రైతన్న పంట పొలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. దాదాపు 25 మందికి పైగా రక్తదానం చేసి మా రక్తం తీసుకో రైతన్నకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీష్రావు, కేటీఆర్ల రక్తం తెచ్చి పంటలపై చల్లితే పంటలు పండుతాయా అంటూ రైతుల సమస్యలను అవహేళన చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో రక్తం చిందించి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, బీఆర్ఎస్ పార్టీకి రక్తం చిందించడం కొత్తేమీ కాదని హితవు పలికారు.
సీఎం వ్యాఖ్యలను సవాల్గా తీసుకుని, రైతుల కోసం ఎన్ని లక్షల యూనిట్ల రక్తాన్నైనా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటిస్తూ.. వేములవాడ నియోజకవర్గంలో రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా నీటిని పంప్ చేసి ఎండిపోతున్న పంటలను తక్షణమే కాపాడాలని చల్మడ డిమాండ్ చేశారు. ఎల్ఎండి(LMD) ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 4.5 TMC నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు.రాబోయే ఎండాకాలంలో ఒక్క హైదరాబాద్ తాగునీటి అవసరాలకే 12 నుంచి 15 టిఎంసిల నీరు అవసరమవుతుందని,మరి ప్రజలకు తాగునీరు ఎక్కడి నుంచి తెస్తారని పాలకులను ప్రశ్నించారు. ఈ నెలాఖరులోగా సాగునీరు అందించకపోతే నాట్లు ముదిరిపోయి దిగుబడి దారుణంగా పడిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దివాళాకోరు ఆలోచనలను పక్కనబెట్టి,అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యేకు అవగాహన లేదు,నియోజకవర్గ సమస్యలపై స్థానిక శాసనసభ్యునికి కనీస అవగాహన లేదని చల్మడ విమర్శించారు. కేవలం మంత్రి పదవి కోసం, సీఎం మెప్పు కోసమే ఆయన టీవీల ముందు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఐటిఐ చదివిన ఎమ్మెల్యే,పాలిటెక్నిక్ చదివిన వారిని అవహేళన చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. సీఎం కార్యాలయం నుంచి తెచ్చిన కాగితాలు పట్టుకుని టీవీల్లో మాట్లాడటం కాదని,రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో తలెత్తే కరువు పరిస్థితులకు స్థానిక ఎమ్మెల్యేనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతాంగ శ్రేయస్సు కోసం KCR నాయకత్వంలో తాము ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని చల్మడ లక్ష్మీనరసింహారావు స్పష్టం చేశారు.BRS శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు.రైతులకు, ముఖ్యంగా ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
Sircilla,Karimnagar,Telangana
