Last Updated:
రాయలసీమ ఉక్కు కల సాకారమయ్యే దిశగా కడప జిల్లా జమ్మలమడుగులో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 2028 జూలై 3న రెండో దశ ప్రారంభిస్తానని ప్రకటించిన ఆయన, రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
రాయలసీమ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమ కల సాకారమయ్యే దిశగా కీలక అడుగు పడింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అధికారికంగా శ్రీకారం చుట్టారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్తో కలిసి కాంక్రీట్ వేసి పనులను ప్రారంభించిన సీఎం, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 2028 జూలై 3న ఈ స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులను ప్రారంభించేందుకు మరోసారి ఇక్కడికి వస్తానని ప్రకటించారు. రాయలసీమను ఇకపై “రాళ్ల సీమ”గా కాకుండా “రతనాల సీమ”గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరు కృషి చేశారో ప్రజలు గుర్తించాలని సూచించిన సీఎం, అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పాటుతో అక్కడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఇప్పటివరకు అక్కడ రూ.19 లక్షల విలువైన కార్లు తయారయ్యాయని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కోసం స్థానిక రైతులు సుమారు 17 వేల ఎకరాల భూమి ఇచ్చారని గుర్తుచేసిన చంద్రబాబు, అయినప్పటికీ పరిశ్రమ మాత్రం ఏర్పడలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ పేరుతో ఐరన్ ఓర్ స్మగ్లింగ్ మాత్రమే జరిగిందని ఆరోపించారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరినా ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు సీఎం తెలిపారు. స్థానిక వనరులను వినియోగిస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభమైన స్టీల్ ప్లాంట్ ద్వారా రెండేళ్లలోనే ఉత్పత్తి ప్రారంభించేలా అధికారులు, సంస్థ యాజమాన్యం కృషి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రాయలసీమ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చంద్రబాబు పేర్కొన్నారు. కరవుతో గుర్తింపు పొందిన ఈ ప్రాంతాన్ని నీటి వనరులు, ఉద్యానవన పంటలతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాల నుంచి బయటపడేలా పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
జేఎస్డబ్ల్యూ గ్రూప్ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్రానికి శుభపరిణామమని సీఎం అన్నారు. గతంలో 2019 డిసెంబరు, 2023 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు భూమిపూజలు జరిగినప్పటికీ పనులు ముందుకు సాగలేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అన్ని అడ్డంకులను తొలగించి సుమారు 1,100 ఎకరాల భూమిని అందజేసి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వివరించారు. రెండు దశల్లో మొత్తం రెండు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ అభివృద్ధి చెందుతుందని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రముఖ ఉక్కు తయారీ రాష్ట్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Hyderabad,Telangana

