Last Updated:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్ను పోలీసులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్ను పోలీసులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు గడ్డం అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రావణ్ను విచారణ కోసం నక్కపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
యూట్యూబర్ నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారనే సమాచారం అందుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అక్కడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రావణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళనను మరింత ఉధృతం చేస్తూ జనసేన వీరమహిళలు పోలీస్ స్టేషన్ సమీప రోడ్డుపై బైఠాయించి వంటావార్పు నిర్వహించారు. “ఈ వ్యవహారంపై స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదు” అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు జనసైనికులు పోలీస్ స్టేషన్ చుట్టూ పెద్ద ఎత్తున గుమికూడి పరిస్థితిని గమనిస్తున్నారు.
ఇటీవల ఏలూరు సమీపంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి.
ఇదే కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్కు కూడా శ్రావణ్ను పోలీసులు తీసుకెళ్లారు. ఆ సమయంలో ముందుగా ఆయన మద్దతుదారులు, అనంతరం జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆయనను మరో ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
తాజాగా పాయకరావుపేట ప్రాంతానికి చెందిన జనసేన నేతల ఫిర్యాదు మేరకు శ్రావణ్ను నక్కపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే రిమాండ్కు తరలించాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, వీరమహిళలు ఆందోళన కొనసాగిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.
Hyderabad,Telangana
