Last Updated:
పైలట్లకు డ్రగ్ టెస్టులు కఠినతరం చేయాలని డీజీసీఏ యోచిస్తోంది. ఏడాది పొడవునా ర్యాండమ్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది.
విమాన ప్రయాణాల భద్రత విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కమర్షియల్ పైలట్లందరికీ ఏడాది పొడవునా ఎప్పుడైనా, యాదృచ్ఛికంగా సైకోఆక్టివ్ సబ్స్టాన్స్ టెస్టులు నిర్వహించే అవకాశాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని పీటీఐ వెల్లడించింది. పైలట్ల డ్రగ్ టెస్టింగ్ నిబంధనలను మరింత కఠినంగా మార్చే అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోందని పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం తెలిపారు. “ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మొత్తం పైలట్ నెట్వర్క్లో 10 శాతం మందికి డ్రగ్ టెస్టులు చేయాలి. అయితే, నేను చెప్పినట్టుగా డీజీసీఏ సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోంది. మా వైపు నుంచి వచ్చిన ఒక అభిప్రాయం ఏంటంటే, ప్రతి ఒక్క పైలట్ కూడా ఏడాది మొత్తం ఎప్పుడైనా ర్యాండమ్గా డ్రగ్ టెస్టుకు హాజరయ్యేలా ఉండాలి” అని మంత్రి చెప్పారు.

