ఏడేళ్లుగా పునాదులకే పరిమితమైన చింతపల్లి తహశీల్దార్ కార్యాలయం
రూ.90 లక్షల భవనం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలకు తప్పని ఇబ్బందులు
ప్రభ న్యూస్ | చింతపల్లి | జూలై 21:
గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.90 లక్షల వ్యయంతో ప్రారంభించిన చింతపల్లి నూతన తహశీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణం ఏడేళ్లుగా పునాదుల దశలోనే నిలిచిపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇరుకైన, అసౌకర్యాలతో కూడిన పాత కార్యాలయంలోనే సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంది.2018లో అప్పటి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెవెన్యూ రికార్డుల భద్రత, సిబ్బందికి అనువైన కార్యాలయ వాతావరణం, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే గుత్తేదారు పునాదుల వరకు మాత్రమే పనులు చేపట్టి అనంతరం నిర్మాణాన్ని నిలిపివేశారు.తర్వాత కరోనా కాలంలో గుత్తేదారు మృతి చెందడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అయినప్పటికీ ప్రత్యామ్నాయ గుత్తేదారుడిని నియమించడం, పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించడం లేదా అవసరమైన నిధుల కేటాయింపుపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం చింతపల్లి తహశీల్దార్ కార్యాలయం పాత భవనంలోనే కొనసాగుతోంది. ఇరుకైన గదులు, సరైన రికార్డు భద్రత లేకపోవడం, వర్షాకాలంలో కార్యాలయంలోకి నీరు చేరడం వంటి సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. విలువైన రెవెన్యూ రికార్డులు దెబ్బతినే ప్రమాదం నెలకొనగా, సిబ్బంది తీవ్ర ఇబ్బందుల మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ప్రజల పనులు కూడా ఆలస్యమవుతున్నాయని మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు నిర్మాణ స్థలంలో పునాదుల మధ్య కలుపు మొక్కలు పెరిగి, ఇనుప రాడ్లు తుప్పుపట్టడం ప్రాజెక్టు నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతోంది. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారక శిల మాత్రమే అక్కడ కనిపిస్తుండగా, భవనం మాత్రం పునాదులకే పరిమితమైంది.కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలోనైనా నిలిచిపోయిన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని తక్షణమే పునఃప్రారంభించి పూర్తి చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల పాలనకు కేంద్రంగా ఉండాల్సిన కార్యాలయం ఏడేళ్లుగా పునాదుల దశలోనే ఉండటం బాధాకరమని, ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.


