Last Updated:
పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్య దైవంగా కొలిచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.
ఆమెను భక్తులు కేవలం ఒక దేవతగా మాత్రమే చూడరు.. తమ ఇంటి ఆడబిడ్డగా, కుటుంబ సభ్యురాలిగా భావించి కొలుస్తారు. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం ఎదురైనా తమను కంటికి రెప్పలా కాపాడే తల్లిగా నమ్ముతారు. అందుకే ఏడాదికి ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా నెలరోజుల పాటు ఆమె పేరుతో మహోత్సవాలు నిర్వహిస్తారు. గోదావరి జిల్లాల్లో ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించకుండా ఉండే ఇల్లు దాదాపు ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి కుటుంబం అమ్మవారి సన్నిధికి చేరుకుని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇలా దర్శిస్తే ఏడాదంతా అమ్మవారి ఆశీస్సులు, రక్షణ ఉంటాయనే విశ్వాసం భక్తుల్లో బలంగా నెలకొంది.
ఈ మహిమాన్విత క్షేత్రం కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో వెలసిన శ్రీ మరిడమ్మ తల్లి ఆలయం. గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న ఈ అమ్మవారు స్వయంభువుగా వెలిశారని భక్తుల నమ్మకం. స్థానిక కథనాల ప్రకారం, ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ప్రజలు ఒక మహమ్మారి బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షమై తమను రక్షిస్తానని భరోసా ఇచ్చారట. అనంతరం వ్యాధి తగ్గిపోవడంతో పాటు అమ్మవారి ఆనవాళ్లు లభించడంతో అక్కడ ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు ప్రారంభించినట్లు చెబుతారు.
ఆ రోజు నుంచి నేటి వరకు గోదావరి ప్రాంతం అమ్మవారి కటాక్షంతో సుభిక్షంగా ఉందని స్థానికులు విశ్వసిస్తుంటారు. అందుకే ప్రతి ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు అత్యంత వైభవంగా మరిడమ్మ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతుండగా, పెద్దాపురం పట్టణంలో ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో అమ్మవారి జాగరణ నిర్వహించడం దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఈ ఏడాది కూడా తొలి జాగరణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పాల్గొని వేడుకలను ప్రారంభించారు.
మరిడమ్మ తల్లి జాతర ప్రారంభమైందంటే పెద్దాపురం పట్టణం భక్తులతో కిటకిటలాడుతుంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారిపోతాయి. ముఖ్యంగా ఆదివారాలు, సెలవు దినాల్లో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు తరలివస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు, దర్శనానికి భారీ క్యూలు ప్రతి ఏడాది సాధారణంగా కనిపించే దృశ్యాలే.
ఈసారి మాత్రం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. దేవదాయ ధర్మాదాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. భక్తులకు వేగంగా దర్శనం కల్పించడంతో పాటు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, క్యూలైన్లు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి, అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు.
జాగరణ కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మహోత్సవాలు రానున్న రోజుల్లో మరింత వైభవంగా కొనసాగనున్నాయి. తొలి ఆదివారం నుంచే రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో, పోలీసు అధికారులు వెల్లడించారు. గోదావరి జిల్లాల ప్రజల అపార విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి ఉత్సవాలు మరోసారి భక్తి, సంప్రదాయం, సంస్కృతికి అద్దం పడుతూ ఘనంగా ప్రారంభమయ్యాయి.
East Godavari,Andhra Pradesh
