Last Updated:
100 New Airports in India: దేశ విమానయాన రంగంలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు సుమారు రూ.28,840 కోట్లతో సవరించిన ఉడాన్ పథకాన్ని అమలు చేయనుంది. టైర్-2, టైర్-3 నగరాలు, మారుమూల ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంచడంతో పాటు, హబ్-అండ్-స్పోక్ మోడల్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
భారత పౌర విమానయాన రంగం రాబోయే రోజుల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో అద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి సిద్ధమవుతోంది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ‘ఉడాన్’ (UDAN – ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే, రాబోయే 10 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 30,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

