Last Updated:
India Post Apps | ఇండియా పోస్ట్ నుంచి కొత్త డిజిటల్ యాప్స్ వచ్చాయి. పోస్ట్ ఆఫీస్ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ యాప్స్తో పోస్టల్ సేవలను మొబైల్లోనే ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది.
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా డాక్ సేవా యాప్, డాక్ మిత్ర యాప్లను ప్రారంభించారు. పోస్టల్ సేవలను డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఇది మరో ముందడుగు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని కూడా పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా మరమ్మతులు చేసిన 14 పోస్ట్ ఆఫీస్ భవనాలను కూడా సింధియా ప్రారంభించారు. డాక్ సేవా యాప్ను పోస్టల్ టెక్నాలజీలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సహకారంతో పోస్టుల శాఖ రూపొందించింది. ఇది ఆండ్రాయిడ్ మొబైల్ యాప్. సాధారణంగా ప్రజలు ఉపయోగించే ఎన్నో పోస్టల్ సేవలను ఒకే యాప్లో అందించడం దీని ప్రధాన ఉద్దేశం.

