ప్రారంభోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇంధన సామర్థ్యం కేవలం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశం కాదని, ఆర్థిక పోటీలో కీలక వ్యూహమని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఆర్థిక కార్యకలాపాలను తగ్గించడం పరిష్కారం కాదని, ప్రతి యూనిట్ విద్యుత్తును మరింత సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొత్తగా విద్యుత్ను ఉత్పత్తి చేయడం కంటే ఆదా చేసే విద్యుత్ యూనిట్ చౌకగా ఉంటుందని పేర్కొన్నారు. సమర్థవంతమైన మోటార్లు, మెరుగైన శీతలీకరణ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ భవనాలు, డిజిటల్ ఎనర్జీ మేనేజ్మెంట్ ద్వారా విద్యుత్ డిమాండ్ను తగ్గించవచ్చని వివరించారు. దీనివల్ల విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడితో పాటు నిర్వహణ ఖర్చులు, ఉద్గారాలు కూడా తగ్గుతాయని తెలిపారు.
హైదరాబాద్లో 25వ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్..
సమ్మిట్ చైర్మన్, BLP-Industry.AI వ్యవస్థాపకుడు తేజప్రీత్ సింగ్ చోప్రా ఇంధన సామర్థ్యాన్ని ‘మొదటి ఇంధనం’గా అభివర్ణించారు. ఇది ఇంధన డిమాండ్, వ్యయాలను తగ్గించడంలో కీలకమని చెప్పారు. కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ సాధనాల సహాయంతో ఇంధన పొదుపు అవకాశాలను గుర్తించి, వాటిపై వేగంగా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. పవర్ ప్లాంట్ సమ్మిట్ 2026 చైర్మన్, NTPC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ శర్మ మాట్లాడుతూ భారత ఇంధన పరివర్తన అనేది కేవలం కొత్తగా ఎన్ని మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించామనే అంశంతో నిర్ణయించబడదని, పునరుత్పాదక ఇంధనాన్ని ఎంత సమర్థంగా అనుసంధానించామనేదీ ముఖ్యమని అన్నారు. నెట్జీరో దిశగా థర్మల్ పవర్ను వెంటనే పూర్తిగా వదిలేయలేమని, అయితే దాన్ని మరింత సమర్థవంతంగా, అనువుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పేపర్టెక్ 2026 చైర్మన్, శేషసాయి పేపర్ అండ్ బోర్డ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ భద్తి మాట్లాడుతూ ఇంధన సామర్థ్యం, డీకార్బనైజేషన్ పరిశ్రమల భవిష్యత్తును నిర్ణయించే రెండు కీలక అంశాలని పేర్కొన్నారు. భారతీయ కాగిత పరిశ్రమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని, పునరుత్పాదకత, రీసైక్లింగ్ ద్వారా నెట్జీరో భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని తెలిపారు.
సదస్సులో మూడు కీలక ప్రచురణలను కూడా విడుదల చేశారు. ‘ది ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇంపరేటివ్: లెసన్స్ ఫ్రమ్ ది పాస్ట్, లీడర్షిప్ ఫర్ ది ఫ్యూచర్’ నివేదిక భారత ఇంధన సామర్థ్య ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్తు ప్రాధాన్యతలను వివరిస్తుంది. ‘సీఐఐ థర్మల్ పవర్ ప్లాంట్ బెంచ్మార్కింగ్ రిపోర్ట్ 2026’ థర్మల్ ప్లాంట్ల పనితీరు ప్రమాణాలు, వనరుల వినియోగ మెరుగుదలకు ఉపయోగపడుతుంది. ‘బెస్ట్ ప్రాక్టీస్ మాన్యువల్ ఇన్ పేపర్ సెక్టార్–వాల్యూమ్ 14’లో ఇంధన, వనరుల సామర్థ్యానికి సంబంధించిన 11 ఉత్తమ పద్ధతులను పొందుపరిచారు.
ఈ సందర్భంగా 27వ సీఐఐ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. 15కు పైగా రంగాలకు చెందిన 263 పరిశ్రమలు తమ ఉత్తమ పద్ధతులను పంచుకున్నాయి. సదస్సులో 1,600 మందికి పైగా విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రముఖులు, స్టార్టప్లు, పరిశోధకులు పాల్గొనగా, 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ వక్తలు ప్రసంగించారు. ప్రదర్శనలో ఇంధన సామర్థ్యం, స్వచ్ఛమైన సాంకేతికతలకు సంబంధించిన 75కు పైగా వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలు, పరిష్కారాలను ప్రదర్శించారు.
సీఐఐ–గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్లో భాగమైన ఎనర్జీ ఎఫిషియెన్సీ కౌన్సిల్ గత మూడు దశాబ్దాలుగా భారత పరిశ్రమల్లో తక్కువ కార్బన్ ఉద్గారాల పరివర్తన కోసం పనిచేస్తోంది. ఇప్పటివరకు 20కి పైగా పారిశ్రామిక రంగాల్లో 2,600కు పైగా ఎనర్జీ ఆడిట్లు నిర్వహించింది. 1,00,000 మందికి పైగా నిపుణులకు శిక్షణ ఇచ్చింది. ఈ కార్యక్రమాల ద్వారా పరిశ్రమలకు ఏటా ₹3.5 బిలియన్లకు పైగా, అంటే ₹350 కోట్లకు పైగా పునరావృత ఇంధన పొదుపు అందేలా చేయగలిగింది.
