Last Updated:
చిత్తూరు జిల్లా పలమనేరులో సోలార్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం. యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ రూపొందించిన ఈ స్టేషన్లో 9 ఫోన్లు ఛార్జ్ చేయవచ్చు.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. బ్యాటరీ అయిపోతే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో మొబైల్ ఛార్జింగ్ కోసం వెతకడం, దొరికినా డబ్బులు చెల్లించి ఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమస్యకు వినూత్న పరిష్కారం చూపుతూ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో సోలార్ ఆధారిత మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
పలమనేరు పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సోలార్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. పలమనేరు మండలం మొరం గ్రామ పంచాయతీకి చెందిన యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ ఈ వినూత్న పరికరాన్ని రూపొందించారు. పర్యావరణహితంగా సౌరశక్తితో పనిచేసే ఈ స్టేషన్లో ఒకేసారి తొమ్మిది మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
ప్రయాణికులు, స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపొందించామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పలమనేరుకు వచ్చే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో కూడా ఇలాంటి సోలార్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సందర్భంగా యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని యువతకు పిలుపునిచ్చారు. సాంకేతికతను సమాజ ప్రయోజనాలకు ఉపయోగపడేలా మలచడంలో పవన్ కుమార్ చూపిన చొరవ పలమనేరు పేరును మరింతగా నిలబెడుతోందని కొనియాడారు.
ప్రస్తుతం ఈ సోలార్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. విద్యుత్పై ఆధారపడకుండా సౌరశక్తితో పనిచేస్తూ, ఒకేసారి తొమ్మిది మొబైల్లకు ఛార్జింగ్ సదుపాయం కల్పించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఆవిష్కరణను ఇతర పట్టణాల్లో కూడా అమలు చేస్తే మరింత మందికి ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్వీ బాలాజీ, కుట్టీ, గిరిబాబు, ఖాజా, శ్రీధర్, మదన్, రూపేష్, బీఆర్సీ కుమార్, రమేష్, శ్రీనివాసులు, నదీం, వెంకటరమణ, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, యుగంధర్తో పాటు జనసేన నాయకుడు హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Chittoor,Chittoor,Andhra Pradesh
