Last Updated:
ఈ సీసీ ఫుటేజ్ చూస్తే రాత్రి నిద్రపోలేరు. బీకేర్ఫుల్.. బయటకు వెళ్లే ముందు ఈ వీడియో కచ్చితంగా చూడండి!
తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల సరిహద్దుల్లో వన్యప్రాణుల సంచారం ఈ మధ్యకాలంలో తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో వెలుగుచూసిన చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. మండల పరిధిలోని రాగంపేట గ్రామంలోని ఓ రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రాత్రి సమయంలో చిరుత స్వేచ్ఛగా తిరుగుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. దీనికి తోడు సమీపంలోని పామాయిల్ తోటల్లో సైతం చిరుత అడుగుల ముద్రలను గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పామాయిల్ తోటల్లోని పాదముద్రలను నిశితంగా పరిశీలించి చిరుత సంచారాన్ని అధికారికంగా నిర్ధారించారు. ఖానాపురం మండలంలో విస్తారంగా పామాయిల్ తోటలు ఉండటంతో.. నక్కలవారి కాల్వ వెంబడి మనుబోతుగడ్డ, పోచారం అటవీ ప్రాంతాల నుంచి ఈ చిరుత వేట కోసం జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది చిరుత కదలికలపై నిఘా పెంచారు. గ్రామ పరిసరాలతో పాటు వ్యవసాయ బావుల వద్ద ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఆహారం కోసం, పశువులను వేటాడేందుకు చిరుత గ్రామంలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు గట్టిగా హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పశువులను బయట వదిలేయకుండా సురక్షిత ప్రదేశాల్లో కట్టేసుకోవాలని సూచించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద కరెంట్ తీగలు అమర్చొద్దని, వన్యప్రాణికి ఎలాంటి హాని తలపెట్టొద్దని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న విజ్ఞప్తి చేశారు.
Warangal,Telangana
