Last Updated:
తెలంగాణలో కోడిగుడ్ల ధరలు మూడు నెలల్లో రూ.4 నుంచి రూ.8కు పెరిగి, త్వరలో రూ.10కు చేరే అవకాశం, ఉత్పత్తి తగ్గుదల, దాణా ఖర్చులు, ఎగుమతులు కారణంగా వినియోగదారులకు భారము
వీకెండ్ వస్తే చికెన్, మటన్తో పాటు కోడిగుడ్ల కొనుగోళ్లు కూడా భారీగా పెరుగుతాయి. అయితే ఈసారి వినియోగదారులకు షాక్ ఇస్తోంది చికెన్ కాదు.. కోడిగుడ్డు ధర. గత మూడు నెలల్లో గుడ్ల ధరలు వరుసగా పెరుగుతూ ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు రూ.8 వరకు విక్రయమవుతోంది. మార్కెట్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో ఒక్క గుడ్డు ధర రూ.10కు చేరే అవకాశముందని పౌల్ట్రీ రంగ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్లో ఒక్క గుడ్డు సుమారు రూ.4 ఉండగా, మే నెలలో రూ.5కు చేరింది. జూన్ తొలి వారంలో రూ.6కు పెరిగిన ధర, నెలాఖరుకు రూ.8 వరకు చేరింది. రెండు వారాల క్రితం రూ.6 నుంచి రూ.6.50 మధ్య విక్రయమైన గుడ్డు ప్రస్తుతం రూ.7.50 నుంచి రూ.8 వరకు అమ్ముడవుతోంది. దీంతో రోజువారీ ఆహారంలో గుడ్డును తప్పనిసరిగా తీసుకునే కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.
తెలంగాణలో సుమారు 4 వేల లేయర్ పౌల్ట్రీ ఫారాలు ఉండగా, సాధారణంగా రోజుకు 4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. వీటిలో సగం రాష్ట్రంలోనే వినియోగం కాగా, మిగిలిన సగం ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. అయితే ఈ ఏడాది తీవ్ర వేసవి ప్రభావంతో దాదాపు 10 శాతం కోళ్లు చనిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా మార్కెట్లో డిమాండ్కు తగిన సరఫరా లేక ధరలు పెరిగాయి.
దాణా, ఔషధాల ధరలు గణనీయంగా పెరగడం కూడా గుడ్డు ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. నేషనల్ ఉత్తర తెలంగాణ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ, రైతు వద్ద ఒక్క గుడ్డు ధర సుమారు రూ.6 ఉండగా, రిటైల్ మార్కెట్లో అది రూ.8కు చేరుతోందన్నారు. ఒక గుడ్డు ఉత్పత్తి చేయడానికి మేత, మందుల ఖర్చు కలిపి దాదాపు రూ.7 వరకు అవుతోందని చెప్పారు. గతంలో పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు తగ్గి పౌల్ట్రీ రైతులు భారీ నష్టాలు చవిచూశారని, ప్రస్తుతం ధరలు పెరగడం వల్ల ఆ నష్టాల నుంచి కొంత మేర కోలుకునే అవకాశం ఉందని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా గుడ్లకు డిమాండ్ పెరగడం, విదేశాలకు ఎగుమతులు అధికమవడం, ఇరాన్ యుద్ధం కారణంగా దాణా ధరలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు కోళ్లలో చేపట్టే మౌల్టింగ్ ప్రక్రియ కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. ఈ ప్రక్రియలో కోళ్ల బరువును నియంత్రించేందుకు కొన్ని రోజుల పాటు దాణాను తగ్గిస్తారు. సుమారు 15 నుంచి 20 రోజుల పాటు గుడ్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో మార్కెట్లో సరఫరా తగ్గుతోంది.
ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 పౌల్ట్రీ ఫారాలు ఉన్నప్పటికీ, సాధారణంగా రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి కావాల్సి ఉండగా, ఎండల ప్రభావంతో ప్రస్తుతం 60 లక్షల గుడ్లకే ఉత్పత్తి పరిమితమైందని పౌల్ట్రీ రంగ నిపుణులు తెలిపారు. వీటిలో రోజుకు 25 నుంచి 30 లక్షల గుడ్లు మహారాష్ట్రకు ఎగుమతి అవుతుండగా, మిగిలినవి మాత్రమే స్థానిక మార్కెట్కు అందుతున్నాయి.
ప్రస్తుతం పౌల్ట్రీ నిర్వాహకులు రిటైల్ వ్యాపారులకు హోల్సేల్గా ఒక్క గుడ్డును రూ.6.05 చొప్పున విక్రయిస్తుండగా, మార్కెట్లో అదే గుడ్డు రూ.7.50 నుంచి రూ.8 వరకు అమ్ముడవుతోంది. పెరిగిన ధరల ప్రభావం ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకంపై కూడా పడుతోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, గుడ్ల ధరల పెరుగుదల కారణంగా సరఫరాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి ఉత్పత్తి పెరిగితేనే ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని, లేకపోతే గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశాన్ని పౌల్ట్రీ రంగ నిపుణులు కొట్టిపారేయడం లేదు.
Hyderabad,Telangana

